Murdered: పేకాటలో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

పేకాడుతున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని, మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 10:11 PM IST

పేకాడుతున్న వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని, మరో వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరబొంతుల నాగరాజు (36) అనే వ్యక్తి గ్రామంలో కూలీ పని చేస్తూ, భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై గ్రామంలోని పల్లె ప్రకృతి వనం వద్దకు వెళ్లి దానబోయిన రామచంద్రం అలియాస్ స్వామి, గడ్డం శ్రీను, నిరటి బాలయ్య అనే ముగ్గురు వ్యక్తులతో పల్లె ప్రకృతి వనం లోపల పేకాట ఆడుతున్నారు.

అప్పటికే వీరంతా మద్యం తీసుకున్నారు. కొంత సమయం తర్వాత అక్కడి నుంచి నీరటి బాలయ్య వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తడంతో నాగరాజును, దానబోయిన రామచంద్రం అనే వ్యక్తి అక్కడున్న కర్రతో తలపై పలుమార్లు బలంగా బాధడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రామచంద్రం అక్కడి నుంచి పరారు కాగా.. గడ్డం శ్రీను జరిగిన విషయం గ్రామస్తులకు తెలిపి పారిపోయాడు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తరలించారు. కర్రతో కొట్టి చంపి పారిపోయిన వ్యక్తి, సహకరించిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుని భార్య బాలలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. ఘటన స్థలాన్ని సిద్దిపేట ఏసిపి చల్లా దేవారెడ్డి , సీఐ కృష్ణ, ఎస్ఐ మహేందర్ పరిశీలించారు.