BRS Leaders: మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS Leaders) పార్టీ నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ (Congress) గూటికి చేరుతుండటంతో పాలమూరులో కారు పార్టీ ఖాళీ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వలసలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్కు పెద్ద ఎదురుదెబ్బగా పరిణమిస్తోంది. తాజాగా జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా పత్రాన్ని సమర్పించిన గోపాల్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Also Read: Karun Nair: కంటతడి పెట్టిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్, ఇదిగో ఫొటో!
గోపాల్ యాదవ్తో పాటు, మాజీ కౌన్సిలర్ పద్మజ గోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు గుమ్మాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ ముదిరాజ్, కురువ సత్యం సహా మరో 50 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికల పరంపర జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఇటీవలి ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ వలసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో మహబూబ్నగర్ జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో వేచి చూడాలి.