KTR: పెద్దపల్లిలో పెద్ద మెజారిటీతో గెలుస్తున్నం, వరంగల్ లో విజయం మనదే!

  • Written By:
  • Updated On - April 15, 2024 / 07:09 PM IST

KTR: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు.. అటు బీజెపికి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ తోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని వెల్లడించారు.

వరంగల్ నుంచి బీఆర్ఎస్ బరిలోకి దించిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని గుర్తు చేశారు. 2001 నుంచి కేసీఆర్ గారితో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు..

ఇక పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయం అయిపోయిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం తో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు. అన్నదాతల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. నాయకుల వలసల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, తెలంగాణ సమాజం బీఆర్ఎస్ తోనే ఉందన్నారు.

ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బిజెపికి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని సూచించారు. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి బీఆర్ఎస్ గెలుపు కోసం కదం తొక్కాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు సమిష్టిగా పనిచేస్తామని, నాయకత్వం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తామని నేతలంతా వాగ్దానం చేశారు.