Site icon HashtagU Telugu

KTR : రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా..తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు : కేటీఆర్‌

ktr-comments-on-revanth-reddy

ktr-comments-on-revanth-reddy

KTR : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో ‘చిట్‌చాట్’ పేరుతో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. నా మీద ఎలాంటి డ్రగ్స్ కేసు నమోదైంది? అలాంటిది ఉంటే ఆధారాలతో బయటపెట్టండి. దమ్ముంటే నేరుగా నా ముందే మాట్లాడండి. మీడియా చిట్‌చాట్‌లలో తిరుగుతూ విమర్శలు చేయడం ఏం నైతికత? సీఎంగా మీ స్థాయికి తగినట్టే ప్రవర్తించాలి. ఇలా వ్యక్తిగత ఆరోపణలు చేయడం కొత్త కాదుగానీ, ఇప్పుడు మాత్రం ఇది సహించదగినది కాదు. మిమ్మల్ని కోర్టులో కలుస్తాను. తప్పుడు ఆరోపణలకు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు అని కేటీఆర్‌ హెచ్చరించారు.

Read Also: Rain : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బనకచర్ల వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి బాధ్యత తప్పించుకుంటున్నారని ఆరోపించారు. బనకచర్ల భూములపై నేను చేసిన సవాల్‌ను సీఎం ఇప్పటికీ స్వీకరించలేదు. ఇప్పుడు చిట్‌చాట్ పేరుతో వాస్తవాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగిన ప్రవర్తన కాదని ప్రజలు గమనిస్తున్నారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్‌కి వత్తాసు పలకడం కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చర్యగా చూస్తున్నాం అని హరీశ్‌ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్‌ గౌడ్ అలియాస్ నల్లబాలు కేసులో పోలీసులు చూపుతున్న దురుసు తీరుపైనా కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. మాకూ ఒక రోజు వస్తుంది. అప్పటికి మీరు చేసిన ప్రతి చర్యను సమీక్షిస్తాం. డీజీపీ కూడా రాజ్యాంగానికి విధేయుడిగా ఉండాలి. అధికారులపై మనం నమ్మకంతో ఉండాలనిపించాలే కానీ భయంతో కాదు అని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే. కానీ అవి వాస్తవాలపై ఆధారపడాలి. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మాకు ఉన్న హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటాం అని పేర్కొన్నారు. ఇక, సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నాయంటూ బీఆర్ఎస్‌ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నుంచి మరో స్పందన వస్తుందా? లేదంటే కోర్టు మందలింపు తప్పదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: Swachh Survekshan Awards : ‘క్లీన్‌ సిటీ’గా ఎనిమిదోసారి ఇండోర్

 

 

Exit mobile version