KCR: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు: కేసీఆర్

  • Written By:
  • Updated On - March 22, 2024 / 07:08 PM IST

KCR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వంకుట్ల అరెస్ట్ మరువక ముందే, ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం మరింత సంచలనం రేపింది. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టును పలు పార్టీలు ఖండించగా, తాాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని ఆయన అన్నారు.

ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు.

‘‘ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటున్న‌ది. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తున్న‌ది. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ . అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం’’ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.