Jamili Elections : వెయ్యి గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు కొట్టుకుపోతుందని సామెత. అలాంటి పరిస్థితి బీజేపీ రూపంలో ఇప్పుడు కేసీఆర్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ తిరుగులేని రాజకీయాలు చేశారు. ఆయన చేతిలో మోసపోయిన వాళ్లు, దగాపడ్డోళ్లు చాలా మంది ఉన్నారని ఉద్యమకారులు చెబుతారు. ఆయన మోసాల బారీన పడ్డ జాబితా చాంతడంత ఉందని అనేక మంది పేర్లను చెబుతుంటారు. అంతేకాదు, రాజకీయాల్లో అపరచాణక్యునిగా పేరుగాంచిన చంద్రబాబును తెలంగాణ వైపు చూడకుండా చేయగలిగారు. అంతటి రాజకీయ మేధావి కేసీఆర్ అంటూ పలువురు ప్రశసిస్తుంటారు. సాక్షాత్తు సోనియాగాంధీని బురిడీ కొట్టించిన ఘనుడు కేసీఆర్.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు ఎలా ఉంటాయో దాదాపు దేశంలోని రాజకీయ ఉద్ధండులకు తెలుసు. అందుకే, ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ ముందుకొచ్చినా, ప్రత్యామ్నాం కావాలని కోరుకుంటున్నా కేసీఆర్ ను విశ్వసించే చేతుల కలిపే వాళ్లు పెద్దగా లేరు. ప్రత్యేక రాష్ట్రం సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీకి స్వానుభవం. ఆనాడు యూపీఏలోని పక్షాలకు కూడా తెలుసు. ఇక మిగిలిన పార్టీలు కేసీఆర్ చేసిన బాసలు, యాసలు, రాజకీయ ఫల్టీలను చూశాయి. ఇప్పుడు కొత్తగా ఆయన జిమ్మిక్కుల్లో పడే వాళ్లు దాదాపుగా లేరు. కానీ, పడినట్టే కనిపించిన బీజేపీ ఇప్పుడు కేసీఆర్ కే (Jamili Elections) జలక్ ఇచ్చేలా ఉంది. అందుకే, తాడి దన్నేవాడు ఒకడుంటే తలని తన్నేవాడు మరొకడు ఉంటారని చెబుతారు పెద్దలు.
Also Read : BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?
గత ఏడాది నుంచి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నడిచిన రాజకీయాన్ని అవలోకనం చేసుకుంటే, ఆ రెండు పార్టీలే తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థులు అనే భావం కలిగించారు. ఆ తరువాత ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల ఫాం హౌస్ ఎర కేసులు బయటకు వచ్చాయి. ఆ సందర్భంగా ఇరు పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి. హఠాత్తుగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తరువాత ఏమి జరిగిందో తెలియదుగానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కవితకు క్లీన్ చిట్ వచ్చేసింది. ఇంకేముంది, ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ తెలంగాణ సమాజం కోడైకూసింది. అదే నిజమని నమ్మింది. ఫలితంగా బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశం నుంచి భూమికి చేరిందని సర్వేల సారంశం. అదే సమయంలో బీజేపీ రథసారథిగా దూకుడు మీదున్న బండి సంజయ్ బదులుగా కిషన్ రెడ్డిని కూర్చొబెట్టారు. ఇదంతా కేసీఆర్ ఇష్టప్రకారం జరిగిన మార్పులు మాదిరిగా ఫోకస్ అయింది. దీంతో బీజేపీ ఇక తెలంగాణలో తట్టాబుట్ట సర్దేసిందని ప్రచారం మొదలైయింది.
వచ్చే ఎన్నికలకు దూకుడుగా ఉన్న కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించారు. దాన్ని చూసి ఇంకేముంది మూడోసారి సీఎంగా కేసీఆర్ అవుతాడని బీఆర్ ఎస్ ప్రచారం చేసుకుంది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ డిసెంబర్లోపు ఎన్నికలు అంటూ కేసీఆర్ కూడా ఊదరగొట్టారు. ఆ మేరకు సమాచారం ఢిల్లీ బీజేపీ నుంచి ఆయనకు ఉందని నమ్మారు. సీన్ కట్ చేస్తే, జమిలి ఎన్నికలంటూ (Jamili Elections) మోడీ, షా ద్వయం ట్విస్ట్ ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. ఆ మాత్రం జర్క్ ఇచ్చిన వాళ్లు ఇప్పటి వరకు కేసీఆర్ కు గత 20ఏళ్లలో తగ్గల్లేదు. ఇప్పుడు మోడీ, షా రూపంలో ఆయనకు షాక్ తగిలింది. జమిలి ఎన్నికలు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించుకుంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వాయిదా పడడం ఖాయం.
Also Read : BRS South Sketch : దక్షిణ తెలంగాణపై KCR ప్లాన్ B
ఒక వేళ జమిలి ఎన్నికలు లేదా మినీ జమిలీ ఎన్నికలు సాధ్యపడే అవకాశం ఉంటే మాత్రం కేసీఆర్ అనుకున్నదానికి భిన్నంగా బీజేపీ అడుగులు వేసినట్టే. అప్పుడు కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని కంటోన్న కలలు కల్లలై పోవడం తథ్యమంటూ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ మోజార్టీతో ప్రభుత్వంలోకి కేసీఆర్ వచ్చారు. ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలను బీజేపీ, ముగ్గుర్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ లెక్కన కేసీఆర్ కు అసెంబ్లీ స్థానాలు 40-50 మధ్య మాత్రమే ఉండాలి. కానీ, 83 స్థానాలతో ఆయన రెండోసారి సీఎం అయ్యారు. అంటే, లోక్ సభ ఎన్నికలకు ఒక విధంగా ప్రజల మూడ్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరోలా ఉంటుంది. ఆ విషయం గ్రహించిన కేసీఆర్ 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లారు.
ఇప్పుడు కూడా ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావించారు. ఆ మేరకు ఢిల్లీ వేదికగా పావులు కదిపారు. సరేనంటూ ఢిల్లీ బీజేపీ పెద్దలు తలాడించడంతో నమ్మారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే, ఆయనకు లభించిన హామీ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు జరగవని అర్థమవుతోంది. గతంలో 2004 ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు ఎదరైన పరిస్థితులు కేసీఆర్ తప్పవని తెలంగాణలోని రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్నారు. జమిలి ఎన్నికలకు వస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే ముద్ర కూడా పోతుంది. లోక్ సభ ఎన్నికల క్రమంలో మోడీ రాజకీయ గ్లామర్ (Jamili Elections) కూడా కలిసొస్తుంది. అప్పుడు కేసీఆర్ బీజేపీ చేతిలో మోసపోయిన లీడర్ గా మిగులుతారు. ఇప్పటి వరకు పలువుర్ని మోసం చేసిన ఆయన మోసపోవడం అదే తొలిసారి అవుతుంది.