తెలంగాణ సీఎం కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. ఆయన వేసే ఎత్తుగడలు ఎవరికీ ఒక మాత్రన అంతుబట్టవు. ఆకస్మాత్తుగా మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించే శాసన సభాపక్ష , పార్లమెంటరీ బోర్డు, రాష్ట్ర కార్యవర్గం సమావేశాల లక్ష్యం ఏమిటి? ఆయన ఏమి చేయబోతున్నారు? అనే ప్రశ్నలు వేసుకుంటే సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం ముహూర్తం ఈసారి ఫిక్స్ చేస్తారని ఆ పార్టీలో సర్వత్రా వినిపిస్తోన్న చర్చ.
ప్రస్తుతం కేసీఆర్ దృష్టంతా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ మీద ఉంది. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల మీద ఎక్కువగా ఆయన దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వేల ఫలితాలను బేరీజు వేసుకుంటూ తెలంగాణ రాజకీయాల నుంచి దూరం జరగబోతున్నారని జరుగుతోన్న చర్చ. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా ఉన్నారు. దీంతో రాష్ట్రాన్ని విడిచి రాజకీయాలను చురుగ్గా చేయలేకపోతున్నారు. అందుకే, మంత్రి కేటీఆర్ కు పట్టాభిషేకం చేయడానికి సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.
Also Read: TTDP: టీడీపీ వైపు 1983 బ్యాచ్, బీసీలకు కాసాని గాలం!
తెలంగాణ భవన్లో పార్టీ సర్వసభ్య సమావేశంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆ మేరకు పార్టీ ఆఫీస్ అధికారికంగా ప్రతినిధులకు ఆహ్వానం పంపింది. టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశంతో పాటు పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. అంటే, ప్రభుత్వం, పార్టీలో భారీ మార్పులు ఉంటాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. కీలక నిర్ణయాలను కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది.
ఎంతో కాలంగా కేటీఆర్ ఎదురుచూస్తోన్న పట్టాభిషేకం ముహూర్తం ఫిక్స్ కానుందని పార్టీలోని అంతర్గత చర్చ. ఇప్పటికే మంత్రులు శ్రీనివాసగౌడ్, జగదీశ్వరరెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు కాబోయే సీఎంగా కేటీఆర్ ను ఫోకస్ చేశారు. మనుగోడు ఫలితాల తరువాత పట్టాభిషేకం ఉంటుందంటూ పార్టీలోనూ చర్చ జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ భవన్లో మంగళవారం కీలక సమావేశం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.
Also Read: Minister Roja: రోజా మంత్రి పదవికి ఎసరు..?
తెలంగాణ సీఎంగా కేటీఆర్ ను చేయడంతో పాటు ప్రత్యేకమైన పరిపాలన బోర్డును ఒకదాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఆ బోర్డుకు చైర్మన్ గా కేసీఆర్ తో పాటు కేశవరావు లాంటి కొందరు సీనియర్లు సభ్యులుగా ఉంటారని వినికిడి. ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలు ఈ బోర్డు ద్వారా ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి రంగం సిద్దం అవుతుందని సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి జాతీయ పార్టీ బీఆర్ఎస్ కోసం రాష్ట్రంలో సీఎంగా కేటీఆర్ ను చేయడం ఖాయమని ఆ పార్టీలోని కీలక నేతలు విశ్వసిస్తున్నారు.