Student Suicides: విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడిని భరించలేక ఎందరో విద్యార్థుల తనువు చాలించారు. ర్యాంకుల కోసం విద్యాసంస్థలు విద్యార్థుల్ని చదువు పేరుతో రోబోలా చూస్తున్నాయి. లక్షల్లో ఫీజులు కడుతున్న తల్లి దండ్రులు తమ పిల్లల ఆలోచనను పట్టించుకోకుండా కేవలం చదివితే చాలు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 21 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆగస్టు 7న క్యాంపస్లోని తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. మమితా నాయక్ మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతుంది. హైదరాబాద్కు 60 కిమీ దూరంలో సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఉన్న క్యాంపస్లో కొద్ది రోజుల క్రితం సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్లో చేరింది. అయితే ఏమైందో తెలియదు గానీ మామితా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ పోలీసులు గుర్తించారు.
ఇదే క్యాంపస్ లో చదువుతున్న కార్తీక్ (21) అనే విద్యార్థి గత సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నాడు. అవసరానికి చేసిన అప్పులు తలకు చుట్టుకున్నాయి. ఆ బాధతో మనస్తాపానికి గురయ్యాడు. జూలై 17న క్యాంపస్ నుంచి బయటకెళ్లిన కార్తీక్ జూలై 25న విశాఖపట్నం బీచ్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ-హెచ్లో ఏడాది వ్యవధిలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఏడాది సెప్టెంబర్లో రాజస్థాన్కు చెందిన మేఘా కపూర్ (22) హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ సమీపంలోని సంగారెడ్డి పట్టణంలోని లాడ్జిపై నుంచి దూకి మృతి చెందింది. గతేడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన జి.రాహుల్ అనే వ్యక్తి ప్లేస్మెంట్, ఒత్తిడి కారణంగా తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
Also Read: Hyderabad: కన్నా కూతుర్నే కడతేర్చిన తండ్రి.. ఇగో.. జరిగిన యదార్థ గాథ