నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

Published By: HashtagU Telugu Desk
KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

KTR Challenges Revanth Reddy to Resign with 10 MLAs

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని సీఎం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్‌ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన నిలిచారో స్పష్టంగా తేలుతుందని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కనీసం 10 స్థానాలు కూడా గెలవలేకపోయిందని గుర్తు చేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయి ఎన్నికల్లో బీఆర్ఎస్‌ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు. ఇది ప్రజల నమ్మకం ఎవరి మీద ఉందో తెలియజేస్తోందని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయని, ఎన్నికల సమయంలో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి ఇక నుంచి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్‌ ఖాతాలో వేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్‌ సాధిస్తున్న విజయాలను చూసి కాంగ్రెస్‌ నాయకత్వం ఆందోళనకు గురవుతోందని వ్యాఖ్యానించారు. ఓటమి ఎదుర్కొన్న అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ప్రోత్సహించారు. ప్రజల మధ్య ఉండి పనిచేస్తే విజయాలు తథ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటల తీరు మారుతోందని కేటీఆర్‌ విమర్శించారు. సీఎం మాత్రమే కాదు, ఆయన బాటలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరామని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో వారు ఉన్నారని, స్వార్థపూరిత పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.

గెలుపు కోసం కాంగ్రెస్‌ ఎంతటి అరాచకాలకు పాల్పడినా, ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ వెంటే ఉన్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. సర్పంచ్‌ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రజల కోసమే పనిచేయాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా వస్తాయని, వాటిని ఆపే అధికారం ముఖ్యమంత్రి సహా ఎవరికీ లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనవరిలో ఎన్నికలు జరిగితే ఆ దిశగా ముందుకు సాగుదామని, లేదంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి కొత్త గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేద్దామని తెలిపారు. యువతకూ, సీనియర్లకూ సమానంగా అవకాశాలు కల్పిస్తూ బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. ప్రజల నమ్మకమే తమ అసలైన బలం అని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  Last Updated: 19 Dec 2025, 05:51 PM IST