హైదరాబాద్ నగరంలోని చెరువుల రూపురేఖలను మారుస్తూ ‘హైడ్రా’ (HYDRAA) చేపట్టిన పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో ఆక్రమణల కోరల్లో, మురికి కూపాలుగా మారిన చెరువులు ఇప్పుడు పర్యాటక కేంద్రాలుగా ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే పాతబస్తీలోని చారిత్రాత్మక బమృకున్-ఉద్-దౌలా చెరువు మరియు కూకట్పల్లిలోని నల్ల చెరువు ఆధునీకరణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బమృకున్-ఉద్-దౌలా చెరువును ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేయనున్నారు.
నిజాంల కాలం నాటి ఘనచరిత్ర కలిగిన బమృకున్-ఉద్-దౌలా చెరువు ఒకప్పుడు కబ్జాలతో తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరింది. హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించడమే కాకుండా, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, మరియు చిన్నారుల కోసం ప్లే ఏరియాలను నిర్మించింది. చెరువు చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలు నాటడంతో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని నేరుగా హైడ్రా ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతికతను జోడించారు. పాతబస్తీ వాసులకు ఇది ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్గా మారబోతోంది.
మరోవైపు, కూకట్పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కేవలం 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువులో పూడికను తొలగించడంతో, దీని విస్తీర్ణం ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు పెరిగింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో ఇక్కడ కిలోమీటరు పొడవైన పాత్ వే, అధునాతన అవుట్లెట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్పేట బతుకమ్మ కుంట అందుబాటులోకి రాగా, త్వరలోనే మరో 14 చెరువులను రెండో విడతలో అభివృద్ధి చేసేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
