Site icon HashtagU Telugu

No Demolition : సుప్రీం ఇచ్చిన ఆదేశాలు హైడ్రాకు వర్తించవు – హైడ్రా రంగనాధ్ క్లారిటీ

Ranganadh

Ranganadh

No Demolition: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం నిషేధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దేశంలో ఎక్కడా ఏకపక్షంగా బుల్‌డోజింగ్‌ చర్యలు చేపట్టవద్దని కోర్టు పేర్కొంది.. ఈ తీర్పు తో హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు బ్రేక్ పడినట్లే అని అంత అనుకున్నారు. కానీ హైడ్రా కు సుప్రీం కోర్ట్ ఆదేశాలు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాధ్ (Hydra Commissioner Ranganath ) క్లారిటీ ఇచ్చారు.

సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు కేవలం యూపీలోని నేరస్తుల, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. హైడ్రా అనేది ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుందని స్పష్టతనిచ్చారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణలో తమ తీర్పు వర్తించదని సుప్రీం వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. నేరస్తులు, నిందితులుగా ముద్ర పడిన వాళ్ల ఆస్తులను, నిర్మాణాలను కూల్చరాదంటూ మాత్రమే కోర్టు చెప్పిందని పేర్కొన్నారు.

హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపారు. ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా నిద్ర పోతుంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే వందల ఇల్లు నేలమట్టం చేసింది.

ఇక ప్ర‌భుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను స‌వాల్ చేస్తూ హైకోర్టు లో పిటిష‌న్ దాఖ‌లైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ కాద‌ని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తార‌ని … హైడ్రా చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న‌ర్ కోరారు. ఈ పిటిష‌న్‌ను జ‌స్టిస్ కే ల‌క్ష్మ‌ణ్ విచార‌ణ చేప‌ట్టారు. ఈ క్రమంలో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డంపై ఆగ్ర‌హం చేసింది. వివ‌ర‌ణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తార‌ని ప్ర‌శ్నించారు. జీవో 99పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశార‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ కూల్చేశార‌ని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చేసిన‌ట్లు కోర్టుకు పిటిష‌న‌ర్ తెలిపారు. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు కోర్టు వాయిదా వేసింది.

 

Read Also : Weight Loss Formula: 30-30-30 వెయిట్ లాస్ ఫార్ములాతో బ‌రువు త‌గ్గుతారా..?