Cyber Crimes : గత రెండు, మూడేళ్ల వ్యవధిలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్లు నిర్వహించి 52 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 74 సైబర్ నేరాలకు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33 సైబర్ నేరాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. ఈ దర్యాప్తులో కీలక విషయాన్ని గుర్తించారు. పలువురు సైబర్ నేరగాళ్లకు సహకరించిన నలుగురు బ్యాంకు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్, చైనాల్లోని సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు. దేశవ్యాప్తంగా 20 కేసుల్లో ఈ బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉందని నిర్ధారణ అయింది. సదరు సైబర్ కేటుగాళ్లు అక్రమంగా డబ్బులను తరలించుకునేందుకు ఉపయోగపడేలా మ్యూల్ ఖాతాలను ఈ బ్యాంకు ఉద్యోగులు క్రియేట్ చేశారు. ఇందుకుగానూ ప్రతి లావాదేవీకి 5 నుంచి 10శాతం మేర కమీషన్ను సైబర్ కేటుగాళ్ల నుంచి తీసుకున్నారు. ఈ కేసుల్లో సైబర్ క్రిమినల్స్ వద్ద రూ.47.90 లక్షల నగదు, రూ.40లక్షల క్రిప్టో కరెన్సీని హైదరాబాద్ సిటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్థుల ఖాతాల్లోని రూ.2.87కోట్లు ఫ్రీజ్ చేశారు.
Also Read :Maha Kumbh Stampede : అర్ధరాత్రి యోగి సమీక్ష.. మహాకుంభ మేళాపై కీలక నిర్ణయాలు
తెలంగాణ, ఏపీలోని కేసుల వివరాలివీ..
- హైదరాబాద్ గుడిమల్కాపూర్కు చెందిన ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి రూ.3 కోట్లు ఇచ్చింది. సైబర్ నేరగాళ్లు ఆ డాక్టర్కు వీడియో కాల్ చేసి మనీలాండరింగ్ కేసులో ఉన్నారని, డిజిటల్ అరెస్టు అయ్యారని బెదిరించారు. భయపడిపోయిన ఆమె, వారు సూచించిన ఖాతాల్లో రూ.3కోట్లు జమ చేసింది. ఈకేసులో గుజరాత్కు చెందిన హరిపాల్ సింగ్, సయ్యద్ అజియుబ్ భాయ్ను పోలీసులు అరెస్టు చేశారు.
- ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు వస్తాయంటూ హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారి నుంచి రూ.2.06 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఏపీ, తెలంగాణవారే.
Also Read :Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
- రూ.2.06 కోట్లను హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి కొల్లగొట్టిన కేసు దర్యాప్తులో ఏపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల జేఎన్టీయూ కొటక్ మహీంద్రా బ్రాంచీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న కాటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్లో ఉండే సైబర్ నేరగాళ్ల కోసం ఇతడు మ్యూల్ ఖాతాలను తయారు చేశాడు. కోట్లలో అక్రమలావాదేవీలు జరగేందుకు సహకరించాడు.
- ట్రేడింగ్లో భారీ లాభాలొస్తాయని నమ్మించి హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.93 లక్షలు కొల్లగొట్టారు. ఈ డబ్బును అక్రమంగా తరలించుకోవడంలో సైబర్ నేరగాళ్లకు సహకరించేందుకు మ్యూల్ ఖాతాలకు తయారుచేసిన ముగ్గురు బ్యాంకు ఉద్యోగులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బెంగళూరులోని ఆర్బీఎల్ బ్యాంకు విద్యారణ్యపుర బ్రాంచి డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ ఝా, బెంగళూరు యాక్సిస్ బ్యాంకు మల్లేశ్వరం, బ్రాంచి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్ ఇమాముద్దీన్, బ్యాంకు ఉద్యోగి మోహన్ ఉన్నారు.