Site icon HashtagU Telugu

Heavy Rain: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

Emergency Numbers

Emergency Numbers

Heavy Rain: భాగ్యనగరంలో గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rain) కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పాత బస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో రాజన్న బావి, శివాజీ నగర్, శివగంగా నగర్, ఛత్రినాక వంటి ప్రాంతాలలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. నగరంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించడానికి ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారులకు సీఎస్ సూచనలు

రాత్రి 8:30 గంటలకు జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను సమీక్షించిన సీఎస్, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీఎస్, పొలింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముఖ్య సూచనలు

భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో వాటిని త్వరగా తొలగించాలని ఆదేశించారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను అప్రమత్తం చేశారు.

Also Read: Severe Headache : విపరీతమైన తలనొప్పి తరచూ వస్తుందా? ముందు ఇలా చేశాక స్కాన్స్ చేయించుకోండి!

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించవచ్చని, ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందని సీఎస్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భారీ వ‌ర్షంతో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

న‌గ‌రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడారు. వచ్చే కొద్ది గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్,హైడ్రా కమిషనర్,వాటర్ వర్క్ ,విద్యుత్ విభాగం అధికారులతో మాట్లాడారు. నగరంలో ఉన్న 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఏర్పాటు చేసి వాటర్ నిల్వ ఉండకుండా వెంటవెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.