BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనేది కాసేపట్లో తేలిపోనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ నిర్వహించనుంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన పలు కేసుల్లో భాగంగా ప్రస్తుతం కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈనెల 23 వరకు ఆమెకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంటే రేపటి వరకు కస్టడీ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ బెయిల్ పిటిషన్పై కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయి ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కావాలని పిటిషన్ ద్వారా కోర్టును కవిత కోరారు. కవిత పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పలుమార్లు కవితను(BRS MLC Kavitha) విచారించిన ఈడీ.. మార్చి 15న ఆమెను అరెస్ట్ చేసింది. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు ఈ నెల 11న ఆమెను మరోసారి అరెస్ట్ చేశారు. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనకు ఎటువంటి సంబంధం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తనపై అక్రమంగా కేసు పెట్టారని కవిత చెప్తున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసిన జడ్జి, ఆమెను జుడీషియల్ రిమాండ్ కు తరలించారు. దీంతో ఇవాళ విచారణకు రానున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్పైనే కవిత ఆశలు పెట్టుకున్నారు.