Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ”ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు మన ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సిద్దిపేట లేకుంటే కేసిఆర్ లేడు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ లేదు. అవతరణ ఉత్సోవాలను మూడు రోజులు జరిపాం. మొదటి రోజు అమర వీరుల స్తూపం వద్ద, రెండో రోజు తెలంగాణ భవన్లో నిర్వహించకున్నాం. మూడో రోజు జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించుకుంటున్నాం” అని హరీశ్ రావు అన్నారు.
”తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడిన సిద్దిపేట జిల్లా వాసులను గౌరవించుకోవడం మన బాధ్యత. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే.మన సిద్దిపేట మట్టిబిడ్డలు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1969 ఉద్యమకారుడు డాక్టర్ రమణాచారిని సన్మానించాలని ఆహ్వానించాం. మోకాలి నొప్పితో రాలేకపోయినా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నందిని సిద్దారెడ్డి గారు తెలంగాణ కోసం కవులను ఏకం చేశారు. ప్రమోషన్ కూడా వదులుకున్నారు. ఆయనను సన్మానించుకుంటున్నాం. రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్, రామలింగారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, లక్ష్మీకాంతరావు, జేఏసీ నాయకులను కూడా గౌరవించుకుంటున్నాం. వీళ్లు జైళ్లలో పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు. తెలంగాణ రాదని ఎంతోమంది నవ్వినా, నిరాశపరిచినా దీక్షతో పనిచేశారు.
తుల ఉమ గారు అద్భుత పోరాటం చేశారు. రోడ్డుపై బైఠాయించి రక్తసిక్తమయినా మొక్కవోని పోరాటం చేశారు. వీరిని గౌరవించుకోవడం మన కర్తవ్యం” అని హరీశ్ రావు అన్నారు.