Five Tunnel Routes : హైదరాబాద్ సిటీలో 5 సొరంగ మార్గాల నిర్మాణ ప్రతిపాదనలపై అధ్యయనానికి రంగం సిద్ధమైంది. దాదాపు 3 నుంచి 6 నెలల పాటు దీని స్టడీ చేయనున్నారు. సిటీ పరిధిలో సొరంగ మార్గాల నిర్మాణం చేయడం సాధ్యమవుతుందా ? ఒకవేళ సాధ్యమైతే పనులు ఎలా చేపట్టాలి? ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై నిపుణుల టీమ్ అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం పరిశీలించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. సొరంగ మార్గాల నిర్మాణ ప్రాజెక్టు ఈ ఏడాది చివరికల్లా తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక సొరంగ మార్గాల నిర్మాణ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఆసక్తి చూపుతూ మూడు సంస్థలు జీహెచ్ఎంసీకి టెండర్లు సమర్పించాయి. అయితే ఆర్వీ అసోసియేట్స్ సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ భూ సర్వే చేపట్టి ప్రాథమిక నివేదిక అందించనుంది. తదుపరిగా కొన్నినెలల టైం తీసుకొని సొరంగ మార్గాల నిర్మాణ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై తుది నివేదికను ఆర్వీ అసోసియేట్స్ సబ్మిట్ చేయనుంది. నిర్మాణం కనీసం 120 ఏళ్లు నిలిచేలా, తక్కువ భూసేకరణతో జరిగేలా ప్లాన్ను సమర్పించాలని ఆ సంస్థకు జీహెచ్ఎంసీ సూచనలు చేసింది.
బంజారాహిల్స్ రోడ్డు 3లోని షేక్పేట మండల రెవెన్యూ కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు 45 కూడలి వరకు సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టడీ చేసింది. అయితే నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరమని, భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అప్పట్లో ఏజెన్సీ తెలిపింది. అంతకంటే ముందు దుర్గం చెరువు ఎగువన ఉన్న కొండలో నుంచి సొరంగమార్గాన్ని నిర్మించాలన్న ప్రపోజల్ కూడా అటకెక్కింది. తాజాగా ఆ ప్రపోజల్స్ను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి సొరంగ మార్గాలతో సిటీలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో వాటిపై అధ్యయనానికి లైన్ క్లియర్ అయింది.