Land Prices Hike : తెలంగాణలో భూముల ధరలు మళ్లీ పెరగనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను రెండుసార్లు రివైజ్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మరోసారి వాటిని సవరించి పెంచబోతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. ప్రస్తుతం ఈ నిర్ణయంపై ఒక థర్డ్ పార్టీ ప్రైవేటు ఏజెన్సీతో రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలకు, క్షేత్ర స్థాయిలోని వాస్తవిక రేట్లకు పొంతన ఉందా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు ఈ థర్డ్ పార్టీ అధ్యయనం చేయిస్తున్నారు. దీని నివేదిక రాగానే రాష్ట్రంలో భూముల ధరల పెంపై కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఆగస్టు 1వ తేదీ నుంచే తెలంగాణలో భూముల ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈమేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఆగమేఘాలపై భూముల మార్కెట్ విలువలను పెంచితే(Land Prices Hike) ఇబ్బందులు ఎదురయ్యే ముప్పు ఉంటుందని గుర్తించారు. అందుకే థర్డ్ పార్టీ ఏజెన్సీతో దీనిపై అధ్యయనం చేయిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలపై అధ్యయనం కోసం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ జూన్లోనే ఒక సర్క్యులర్ను విడుదల చేశారు. జూన్ 18 నుంచి ఆగస్టు 1 వరకు షెడ్యూల్ ప్రకటించారు. మార్కెట్ విలువల రివిజన్పై ఇప్పటికే ప్రజలు, రైతు ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వారు చెప్పిన రేట్లను ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలతో సరిపోల్చుకున్నారు. అయితే ఏ మేరకు పెంచాలన్న దానిపై ప్రభుత్వమే తుదనిర్ణయం తీసుకోనుంది.
Also Read :National Task Force : డాక్టర్ల భద్రతపై ప్రత్యేక టాస్క్ఫోర్స్.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో భూముల ధరలను పెంచే క్రమంలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలను అనుసరించకుండా, క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి తెలుసుకోకుండా అప్పట్లో భూముల ధరలను రివైజ్ చేశారని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కొన్ని ఏరియాల్లో భూములకు డిమాండ్ ఉన్నా రేట్లు తక్కువగా ఉండిపోయాయని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూముల ధరల సవరణపై ఫోకస్ పెట్టింది. మార్కెట్ విలువకు అనుగుణంగా సముచిత స్థాయిలో తెలంగాణ భూముల రేట్లు ఉండాలని సీఎం రేవంత్ సర్కారు భావిస్తోంది.