HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ విషయాన్ని బాధితులకు వెల్లడిస్తూ జూలై 19, 2024 లోపు నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. కబ్జాదారులపై కఠినంగా ఉంటూనే నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని రంగనాథ్ […]

Published By: HashtagU Telugu Desk
Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో నివాసాలు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ విషయాన్ని బాధితులకు వెల్లడిస్తూ జూలై 19, 2024 లోపు నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. కబ్జాదారులపై కఠినంగా ఉంటూనే నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారందరికీ ఇళ్లు కేటాయిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి వాటిని పునరుద్ధరించే క్రమంలో నివాసాలు కోల్పోతున్న పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. పేదలను అడ్డం పెట్టుకుని చెరువులను ఆక్రమించే బడా కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే.. పొట్టకూటి కోసం వచ్చి గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం తరపున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాదాపూర్‌లోని సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు బాధితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. బాధితుల వివరాలను సేకరించే ప్రక్రియను హైడ్రా వేగవంతం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం సాంకేతికతను జోడించింది. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా.. 2024 జూలై 19వ తేదీకి ముందే అక్కడ నివాసం ఉంటున్న వారిని గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారు. కబ్జాదారులు పేదల పేరుతో చేసే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ.. కేవలం అర్హులైన వారికే ఈ ప్రయోజనం చేకూరేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నగరవ్యాప్తంగా చెరువుల పరిసరాల్లో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని కమిషనర్ రంగనాథ్ వివరించారు.

ఈ సమావేశంలో కమిషనర్ బాధితులతో నేరుగా మాట్లాడి వారి గోడును విన్నారు. ఉపాధి కోసం నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు, చెత్త ఏరుకుంటూ జీవించే వారు అక్కడ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. వీరికి బయట ఇళ్లు అద్దెకు దొరకని పరిస్థితుల్లో చెరువుల చెంతకు చేరామని బాధితులు ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా శాశ్వత గృహవసతి కల్పిస్తుందని రంగనాథ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తూ.. పేదల పక్షాన నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. త్వరలోనే అర్హులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

కాగా, హైడ్రా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో చెరువులను పునరుద్ధరించింది. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. ఇటీవల చెన్నై బృందం హైదరాబాద్ నగరాన్ని సందర్శించి హైడ్రా తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. తమకూ ఇలాంటి వ్యవస్థ అవసరమని అక్కడి అధికారులు వ్యాఖ్యానించారు.

 

 

  Last Updated: 02 May 2026, 11:05 AM IST