Gadwala MLA : త్వరలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితుల రీత్యా, అభివృద్ధి కోసం నిధులను పొందేందుకు ఆయన కారు దిగి హస్తం పార్టీకి జై కొట్టాలని భావిస్తున్నారట. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి(Gadwala MLA), గద్వాల జడ్పీ ఛైర్పర్సన్ సరితకు మధ్య విబేధాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే సరిత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి సరిత పోటీ చేసి 87వేల ఓట్లను సంపాదించారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కృష్ణమోహన్రెడ్డికి 94వేల దాకా ఓట్లు వచ్చాయి. జులై 4వ తేదీతో జడ్పీ ఛైర్పర్సన్గా సరిత పదవీకాలం ముగుస్తోంది. వచ్చే వారం రోజుల్లో ఎప్పుడైనా కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే చేరుతారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి స్పందిస్తూ.. పార్టీ మార్పుపై తాను ఇంకేం నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్లు కూడా కాంగ్రెస్లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యేలోగా కనీసం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరొచ్చని భావిస్తున్నారు. తమ పార్టీ నుంచి జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో బీఆర్ఎస్ పిటిషన్లు వేసింది. పార్టీ మారిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు కంప్లయింట్ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నిరాటంకంగా ముందుకు సాగుతూనే ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇలాగే గంపగుత్తగా కారు పార్టీలో చేర్చుకున్నారు.