Free Wi-Fi AC Sleeper Buses : ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై (Free Wi-Fi) సౌకర్యాన్ని అందించింది. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TSRTC ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే వీటికీ ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది. ప్రయాణికులకు నేటి నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్బళ్లి మార్గాల్లో వీటిని నడపనున్నట్లు సంస్థ తెలిపింది.
బస్సులో సదుపాయాలు:
- ప్రయాణికుల భద్రతకు బస్సు ట్రాకింగ్ సిస్టంతో పాటు బస్సులో ‘పానిక్ బటన్’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది.
- బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్- అలారం సిస్టం (ఎఫ్డీఏఎస్) ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే ఫైర్ డిటెక్షన్ అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటుంది.
- 12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15 కలిపి 30 చొప్పున బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్కు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి.