Rahil – Another Case : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిపై తాజాగా మరో కేసు కూడా నమోదైంది. 2022 ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలోనూ కారు నడిపింది రాహిలే అని పోలీసులు నిర్ధారించారు. ఆనాటి కేసులో రాహిల్ను నిందితుడిగా చేర్చి ఇప్పుడు ఎంక్వైరీని తిరిగి ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..
We’re now on WhatsApp. Click to Join
మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, ఆమె బంధువులు సారికా చౌహాన్, సుష్మా చౌహాన్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఫుట్పాత్పై బెలూన్లు, స్ట్రాబెర్రీలను అమ్ముకునేవారు. కాజల్ రెండు నెలల బాబు పేరు రణవీర్.2022 ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటలకు వారంతా డివైడర్ దాటుతుండగా ఓ కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడగా చిన్నారి రణవీర్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు వదిలాడు. ఆ కారులోని ముగ్గురు యువకులు వెంటనే పరారయ్యారు. ఆ వాహనంపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉండడంపై అంతటా చర్చ జరిగింది. ఆ కారు నడిపింది తానే అంటూ ఆఫ్రాన్ అనే యువకుడు అప్పట్లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కారులో తనతోపాటు రాహిల్(Rahil – Another Case), స్నేహితుడు మహమ్మద్ మాజ్ ఉన్నట్లు పోలీసులకు ఆఫ్రాన్ చెప్పాడు. దీంతో ఆ ఇద్దరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. స్టీరింగ్పై ఉన్న వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోలాయని అప్పట్లో పోలీసులు కూడా నిర్ధారించారు.
తాజాగా 2023 డిసెంబరులో హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్ను నిందితుడిగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. రాహిల్ను ఇటీవల అరెస్ట్ కూడా చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు నిందితులు మహమ్మద్ మాజ్, అఫ్రాన్తో పాటు బాధితురాలు కాజల్ చౌహాన్ తదితరుల్ని పిలిపించి పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు. అఫ్రాన్ తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో..‘‘ ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది రాహిల్’’ అని చెప్పినట్లు తెలిసింది. కారు నడిపినట్లుగా అంగీకరించాలంటూ రాహిల్ బంధువులు బలవంతంగా తనను ఒప్పించారని అతడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు కొత్త కోణంలో ఆ కేసులో దర్యాప్తును తిరిగి మొదలుపెట్టారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్సై చంద్రశేఖర్ను సైతం ఇప్పటికే డీసీపీ ఆధ్వర్యంలో విచారించారు. ఆ ప్రమాదం జరిగిన టైంలో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపైనా ఎంక్వైరీ జరుగుతోంది.