Site icon HashtagU Telugu

BJP : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

Former BRS MLA Guvvala Balaraju joins BJP

Former BRS MLA Guvvala Balaraju joins BJP

BJP: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోచేరారు. ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన ఆయన, ఆదివారం నాడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బాలరాజుకు పార్టీ కండువా కప్పి కాషాయ తీర్థం అందజేశారు. గువ్వల బాలరాజు ఒక న్యాయవాదిగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేసినట్టు బీజేపీ నాయకులు కొనియాడారు. అచ్చంపేట నియోజకవర్గానికే కాకుండా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఉండాలని గువ్వల ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ తమను తక్కువచేసి “సున్నా సీట్లు” అనే పదంతో వదిలిపెట్టిందని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13 శాతం పైగా ఓట్లు వచ్చాయని, పార్లమెంట్ ఎన్నికల్లో 36 శాతం ఓట్లతో 8 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసిందని చెప్పారు.

Read Also: Malla Reddy : రాజకీయ రిటైర్మెంట్‌పై స్పష్టత ఇచ్చిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ విభాగంలో 70 శాతం ఓట్లను బీజేపీ కైవసం చేసుకుందని వెల్లడించారు. బీజేపీ అభివృద్ధి చెందుతుందనడానికి ఇవే నిదర్శనాలని రామచందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల తన జిల్లాల పర్యటనలో భాగంగా 16 జిల్లాలను సందర్శించానని, వేలాది కార్యకర్తలతో కలుసుకున్నానని, ప్రజల నుంచి అభివృద్ధి, సమస్యలపై వేల ఫిర్యాదులు అందాయని చెప్పారు. ప్రజలు ఇప్పటివరకు రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారని, కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని మార్గనిర్దేశం చేయగలదీ, అభివృద్ధి చేయగలదీ బీజేపీ మాత్రమేనని నమ్మకంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు చేస్తూ ప్రజల నుంచి దూరంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ శాఖలపై సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని చెప్పారు. వాజ్‌పేయి హయాంనుంచి మోదీ ప్రభుత్వాల వరకూ ఎవరూ తెలంగాణను విస్మరించలేదని, బీజేపీకి తెలంగాణే గేట్‌వే అని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఫేక్ ఓట్లు గుర్తుకురాలేదని, కానీ మహారాష్ట్ర, హర్యానాలో ఓడిపోయిన తరువాత బీహార్ విషయంలో “ఫేక్ ఓట్లు” అంటూ అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీహార్‌లో ఓటమి భయంతో ముందుగానే రాహుల్ గాంధీ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. “ఫేక్ ఇండియన్” అనే తీవ్ర పదాలను ఉపయోగించిన రామచందర్ రావు, రాహుల్ గాంధీకి నైతికంగా అలాంటి ఆరోపణలు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. బీజేపీపై అసత్య ప్రచారాలు చేయడం, నెగటివ్ రాజకీయాలకే అతడు పరిమితమవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు. రామచందర్ రావు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని పర్యటనలు చేసి బీజేపీ పటిష్టతను మరింత బలోపేతం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ మాస్క్‌తో ఎయిర్ పోర్టులో.. ఫ్యాన్స్, సెక్యూరిటీ మధ్య చికాకు!