Hyderabad Daredevils : హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న రసూల్పురా హౌసింగ్ కాలనీకి చెందిన ఆ తల్లీ కూతుళ్ల సాహసం చూస్తే… ఎవరైనా మెచ్చుకొని తీరుతారు. ఈ కాలనీలో ఆర్కే జైన్ అనే వ్యాపారవేత్త ఉంటున్నారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో వీరికి రబ్బరు ఫ్యాక్టరీ ఉంది. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో వారి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. ఆ టైంలో జైన్ భార్య అమిత మెహోత్, ఆమె కూతురు, పనిమనిషి మాత్రమే ఇంట్లో ఉన్నారు. పనిమనిషి వంటగదిలో ఉండగా… ఆర్కే జైన్ భార్య, కూతురు మరో గదిలో ఉన్నారు. ఆ సమయంలో కొరియర్ అంటూ ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. వంటగదిలో ఉన్న పనిమనిషికి తుపాకీ గురిపెట్టారు. పనిమనిషి పెద్దగా అరవడంతో… మరో గదిలో ఉన్న అర్కే జైన్ భార్య, కూతురు బయటకొచ్చారు. మరో దుండగుడు కత్తిని చూపించి బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు ఇవ్వాలన్నాడు. లేదంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు.
తలకు హెల్మెట్, మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లీకూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు. #rohinipriyadarshini #hyderabad #HashtagU https://t.co/qj4f4c9J0q pic.twitter.com/6X8ArnXyMb
— Hashtag U (@HashtaguIn) March 22, 2024
We’re now on WhatsApp. Click to Join
కత్తి పట్టుకుని బెదిరించిన ఆ వ్యక్తి… గతంలో తమ ఇంట్లో పనిచేసిన ప్రేమ్చంద్ అని జైన్ భార్య గుర్తుపట్టింది. ఎందుకొచ్చావ్ అని అరుస్తూ తిరగబడింది. వారి అరుపులకు వంటగదిలో గన్ పట్టుకొని ఉన్న వ్యక్తి బయటకొచ్చాడు. తళ్లీకూతుళ్లకు గన్ గురిపెట్టి.. కాల్చేస్తానంటూ బెదిరించాడు. అయినా తల్లీకూతుళ్లు కలిసి గన్ పట్టుకున్న వ్యక్తిపై తిరగబడ్డారు. తుపాకీని లాగేసుకున్నారు. దీంతో అతడు పరారయ్యాడు. తల్లీ కూతుళ్ల అరుపులకు చుట్టుపక్క వారంతా గుమిగూడారు. దీంతో కత్తి పట్టుకున్న మరో వ్యక్తి కూడా పారిపోయేందుకు యత్నించాడు. స్థానికుల సాయంతో తల్లీకూతుళ్లు అతన్ని పట్టుకున్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ప్రేమ్చంద్ అని… గతంలో ఆర్కే జైన్ ఇంట్లోనే పనిచేశాడని పోలీసులు గుర్తించారు. తుపాకీతో బెదిరించి పారిపోయిన వ్యక్తి వరంగల్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.జైన్ ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజీలో తళ్లీకూతుళ్ల వీరోచిత పోరాటం రికార్డ్ అయ్యింది. ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలకు హెల్మెట్, మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులతో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లీకూతుళ్లను(Hyderabad Daredevils) నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు.