జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో నకిలీ వార్తల ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రతినిధి సయ్యద్ నియాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను లక్ష్యంగా తప్పుడు రాజకీయ కంటెంట్ సృష్టించి, అది సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందిందని పోలీసులు గుర్తించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 353(2), 352 మరియు 336(4) కింద కేసు (ఎఫ్ఐఆర్ నం. 1948/2025) నమోదు చేసి, బషీర్బాగ్ సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి. వినయ్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
ఈ ఘటన రాజకీయ దృష్ట్యా ప్రధానమైనదిగా భావించబడుతోంది. ఫిర్యాదులో పేర్కొన్నట్లు, కొన్ని సోషల్మీడియా అకౌంట్లు కాంగ్రెస్ నేతలు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో నకిలీ క్లిప్పింగ్స్ సృష్టించాయని, వాటి ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఇలాంటి తప్పుడు వీడియోలు సామాజిక విభజనకు దారితీసే ప్రమాదం ఉందని TPCC హెచ్చరించింది. యువతలో అపోహలు వ్యాప్తి చెందే అవకాశం, సమాజం మధ్య అనుమానాలు పెరగడం వల్ల శాంతిభద్రతలు దెబ్బతినవచ్చినని పార్టీ ప్రతినిధి హెచ్చరించారు. పోలీసులు ఈ క్లిప్పింగ్స్ మూలాన్ని గుర్తించేందుకు మీడియా లాగ్స్, ఐపీ ట్రేసింగ్ తదితర సాంకేతిక పద్ధతుల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నియాజుద్దీన్ మాట్లాడుతూ..ఎన్నికల వేళ ఇలాంటి నకిలీ క్లిప్పింగ్స్ సృష్టించడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఈ తప్పుడు ప్రచారాలు కేవలం ఓటర్లను గందరగోళానికి గురిచేయడమే కాకుండా సామాజిక సౌహార్దాన్ని దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుష్ప్రచారంపై రాజీ పడదని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ రాజకీయ సమాచారమయినా పంచేముందు దాని నిజానిజాలు తనిఖీచేయాలని, తప్పుడు సమాచారం కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఆయన విశ్వాసం ప్రకారం, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనవిజయం సాధిస్తారని, ప్రజల మద్దతు కాంగ్రెస్వైపు ఉన్నదని తెలిపారు.
