Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. అప్పటి ప్రభుత్వంలోని ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల డైరెక్షన్ మేరకే మాజీ ఎస్ఐబీ చీఫ్కు విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు అందాయని అంటున్నారు. అందుకు ఎంచుకున్న విపక్ష నేతల ఫోన్ నంబర్లను సేకరించి.. వాటిని ట్యాపింగ్ చేసే బాధ్యతను నాటి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు అప్పగించారని చెబుతున్నారు. ఈవిషయాన్ని ప్రణీత్ రావు విచారణ సందర్భంగా పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) చేసినట్లుగా ఈ కేసు దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య రావడంతో ఫోన్ ట్యాపింగ్ చేసే అడ్డాను సైబరాబాద్కు మార్చినట్లు విచారణలో ప్రణీత్ రావు అంగీకరించాడు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మరో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రణీత్ రావు పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది.దీంతో ఎవరా ఇద్దరు నేతలు అనేది హాట్ టాపిక్గా మారింది.ఇది సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని పోలీసులు నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండైన ప్రణీత్రావు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగానే ఇప్పటివరకు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు సేకరించాకే మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉన్నారట. ఈ వ్యవహారంలో మరింత సమాచారాన్ని సేకరించేందుకుగానూ ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలను తిరిగి కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ప్రస్తుతం చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉన్నారు.
ప్రణీత్రావు పోలీసుశాఖలోని పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్గా చేరి, 2023లో డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉండటంతో అది సాధ్యమైంది. తాజాగా ప్రణీత్ దందా బహిర్గతం కావడం వల్ల అతడి ప్రమోషన్పై ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అతని పదోన్నతి దస్త్రాన్ని బయటికి తీసి ఆరా తీస్తున్నారు. ప్రణీత్రావుకు ప్రమోషన్ ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది? ఒకవేళ అడ్డదారిలో పొందితే అందుకు సహకరించింది ఎవరు? అనే అంశాలతో ప్రభుత్వానికి నివేదించనున్నారు.