Elephants Attack : ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని సరిహద్దు జిల్లాల ప్రజలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర అడవుల నుంచి ఏనుగుల మంద తెలంగాణలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లోకి ఏనుగులు చొరబడే ముప్పు ఉందని తెలిపారు. ఏనుగుల మందలు ప్రవేశిస్తే ఏయే ప్రాంతాల్లో ఎటువంటి నష్టం వాటిల్లుతుంది ? ఎంతమేర నష్టం జరుగుతుంది ? అనే దానిపై అంచనాలను రూపొందిస్తున్నారు. ఆ నష్టం జరగకుండా అడ్డుకునేందుకు, ఏనుగులను కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపైనా ప్రణాళికను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏనుగులను కంట్రోల్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ముందుగా వాటి కదలికల్ని సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. అవి ఎక్కువగా రాత్రిపూటే అడవుల్లో రాకపోకలు సాగిస్తుంటాయి. కాబట్టి అటవీ పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కూడా పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను మోహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెడీ అయింది.
మహారాష్ట్రలోని ఏనుగుల మంద(Elephants Attack) నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఇటీవల తెలంగాణ అడవుల్లోకి అడుగుపెట్టింది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి, పెంచికల్పేట మండలాల్లో అది భయాందోళనలు సృష్టించింది. ఒకే ఒకరోజు వ్యవధిలో ఇద్దరు రైతుల్ని అది బలిగొంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతులను ఆ ఏనుగు తొక్కి చంపింది. దీంతో ఆ రైతుల కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం ఆ ఏనుగు మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోయింది. ఇద్దరు రైతుల మరణాలు సంభవించినప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు అన్న పదం వినగానే రైతన్నలు వణికిపోయారు. ఎటువైపు నుంచి ఏనుగుల మంద దూసుకొస్తుందో అనే టెన్షన్ వారిని ఆవరించింది. ఆ ఘటనలను మర్చిపోకముందే ఇప్పుడు ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాలలో మళ్లీ ఏనుగుల దడ మొదలైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో దాదాపు 70 ఏనుగులు ప్రస్తుతం సంచరిస్తున్నాయి. ఆ గుంపును ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో సంచరించిన ఏనుగు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనని అధికారులు అంటున్నారు.