Site icon HashtagU Telugu

Warangal : చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలుడు మృతి

Suicide

Deadbody Imresizer

చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కంగహన్ ​​సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వ‌చ్చి జేపీఎన్ రోడ్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని భార్య గీత, ముగ్గురు కుమారులు ఒక కుమార్తెతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైన్‌లో నివసిస్తున్నాడు. కంగహన్ ​​సింగ్ ఇటీవల వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి పిల్లలకు చాక్లెట్లు తీసుకొచ్చాడు. కంగహన్ ​​రెండవ కుమారుడు, సందీప్(8) పిన్నవారి వీధిలోని శారద పబ్లిక్ స్కూల్‌లో రెండ‌వ తరగతి చదువుతున్నాడు. పాఠ‌శాల‌కు వెళ్లే ముందు కంగహన్ సింగ్ భార్య‌ పిల్లలకు చాక్లెట్లు ఇచ్చింది. నోటిలో చాక్లెట్ పెట్టుకుని స్కూల్ మొదటి అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లిన సందీప్ కొద్దిసేపటి తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కంగహన్ ​​సింగ్ వెంటనే వచ్చి బాలుడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయిందని, చికిత్స పొందుతూ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.