TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేత‌ల్లో `టెర్రర్`

ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన త‌రువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌ను ఎలా జీరో చేశారో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయ‌న మీద ప్ర‌యోగిస్తోంది. ఫ‌లితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక రంగాల నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ద‌డ మొద‌లైయింది. ఏ క్ష‌ణం ఎవ‌రి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జ‌రుగుతాయోన‌నే ఆందోళ‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 02:46 PM IST

ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన త‌రువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌త్య‌ర్థుల‌ను ఎలా జీరో చేశారో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయ‌న మీద ప్ర‌యోగిస్తోంది. ఫ‌లితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక రంగాల నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ద‌డ మొద‌లైయింది. ఏ క్ష‌ణం ఎవ‌రి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జ‌రుగుతాయోన‌నే ఆందోళ‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో కేంద్ర ఏజెన్సీలు కొన‌సాగిస్తోన్న‌ దాడులు గులాబీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ఆర్థిక మూలాలను బలహీనపరిచే ప‌నిలో ఉంది. ఆ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంది. వ్యాపార కార్యకలాపాలు, ఎన్నికల సమయంలో పార్టీకి నిధులు అందించే వాళ్ల జాబితాను సేక‌రించింద‌ని తెలుస్తోంది. దాని ప్రకారం కేంద్ర ఏజెన్సీలు మెరుపుదాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని గులాబీ పార్టీలోని నాయ‌కులు అనుమానం.

Also Read:  YS Sharmila : మోడీ వ‌ద్ద‌కు `కాళేశ్వ‌రం` అక్ర‌మాలు! ష‌ర్మిల భేటీ?

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఘర్షణల కారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అవువుతున్నామ‌న్న భయం గులాబీ పార్టీలోని నాయ‌కుల్లో నెల‌కొంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణాలు, మైనింగ్, విద్య, ఆరోగ్యం, ఫార్మా, మద్యం, ఇసుక వ్యాపారంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాలుపంచుకుంటున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 25 మందికి పైగా టీఆర్‌ఎస్ అగ్రనేతలు ఉన్నారు. వాళ్ల గుండెల్లో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థల భ‌యం గూడుక‌ట్టుకుంది.

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రపై బుధ, గురువారాల్లో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేయడంతో టీఆర్‌ఎస్‌ నేతలు షాక్‌కు గురయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్రంలో దాడులు, అరెస్టుల షాక్ నుండి టిఆర్ఎస్ నాయకులు ఇంకా తేరుకోకుండానే ఈ దాడులు జరిగాయి. 104 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణాలు, మైనింగ్‌, విద్య, ఆరోగ్యం, ఫార్మా, మద్యం, ఇసుక వ్యాపారం తదితర రంగాల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు నిధుల సమీకరణలో వీరే ప్రధానమని చెబుతున్నారు.

Also Read:  Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్‌

గంగుల కమలాకర్, రవిచంద్రతో పాటు వారి కుటుంబసభ్యులు గ్రానైట్ మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి సిహెచ్. మల్లా రెడ్డి మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణలో ప్రొఫెషనల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నడుపుతున్నారు. మంత్రులు ఎ.ఇంద్రకరణ్ రెడ్డి మరియు వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్, నిర్మాణ మరియు మైనింగ్ వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారు, లోక్‌సభ సభ్యులు జి.రంజిత్ రెడ్డి మరియు మన్నె శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబం వరుసగా పౌల్ట్రీ ఫార్మా , రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి.వెంకట రామిరెడ్డి కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారాన్ని విస్త‌రింప చేశారు.

ఇక చల్లా ధర్మారెడ్డి వంటి కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో కేంద్ర ఏజెన్సీలు కొనసాగుతున్న దాడులు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ఆర్థిక మూలాలను బలహీనపరిచేందుకే నాయకులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడిందని ఆ పార్టీ అభిప్రాయం. ఇదే ఫార్ములాను 2014 నుంచి ఇటీవ‌ల దాకా టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై కేసీఆర్ ప్ర‌యోగించారు. ఆ పార్టీల ఆర్థిక మూలాల మీద కొట్టారు. దీంతో బంగారు తెలంగాణ కోసం అంటూ టీఆర్ఎస్ పంచ‌న చేరేలా కేసీఆర్ చేశారు. ఇదే ఫార్ములాను ఇప్పుడు బీజేపీ అందిపుచ్చుకుంది. దీనికి ఎండ్ కార్డ్ ఏమిటో చూడాలి.

Also Read:  NTR Marg: ఫార్ములా వ‌న్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌. వివాదాస్ప‌ద‌మ‌వుతున్న నిర్ణ‌యం