EC Rules: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. డేగ కన్నుతో అన్ని పార్టీలు, అభ్యర్థులపై నిఘా పెట్టింది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాపై సీఈసీ స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ సీఈసీ ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. అన్ని రాజకీయ, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నిఘా ఉంచింది. గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తోపాటు ఇతర సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్లపై వివిధ వెబ్ సైట్ల ద్వారా స్కాన్ చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది. తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్ఎమ్ ఎస్ లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా ఈసీ డేగ కన్నుతో చూస్తోంది. నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటివారినైనా కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే కోట్లలో డబ్బు పట్టుకుంది.
ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు, విమర్శలు, ప్రతి విమర్శలు పోస్ట్లు పెట్టిన సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కు, పోస్టులు నమోదు చేసిన వ్యక్తికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. లంగర్హౌస్ పరిధిలో రెండురోజుల క్రితం ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు వివాదాస్పదంగా మారింది. ముందుగానే గుర్తించిన పోలీసులు దాన్ని తొలగించారు. మీమ్స్ పేరుతో నవ్విస్తున్నామనే ఉద్దేశంతో కొందరు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఇటీవలె సోషల్ మీడియాలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురి పాత వీడియోలపై మీమ్స్ చేశారు. దీన్ని గమనించిన సైబర్క్రైమ్ పోలీసులు మీమ్స్ చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. తెలంగాణ, ఏపీలో సుమారు 30 మందికి నోటీసులు జారీ చేశారు.
Also Read: India: ఇజ్రాయిల్ -పాలస్తీనా యుద్ధం.. 212 మంది ఇండియాకు సురక్షితంగా!