Maoist Party – KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రాలను దుయ్యబడుతూ పలు ప్రశ్నలను ఈ లేఖలో లేవనెత్తారు. ‘‘కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి ? హరీశ్ రావు ఏ శ్రమతో వేలకోట్ల ఆసామి అయ్యాడు ? కేసీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏమిటి ? కాళేశ్వరం ద్వారా మేఘా క్రిష్ణారెడ్డి నుంచి కల్వకుంట్ల కుటుంబం పొందిన పర్సంటేజీల వివరాలు ఏమిటి ? సెక్రటేరియట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు ? ప్రజాకంటక నయీమ్ ముఠా ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయిన నాలుగైదు వేల కోట్ల నగదు ఎవరికి చేరింది ? ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పరిధికి రావు గదా ?’’ అని లేఖలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజాకోర్టులో పాలకులు శిక్షించగలరు ? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత మూడుకోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీము బండారం, వరంగల్ హాస్పిటల్ నిర్మాణ వ్యయం పదకొండు వందల కోట్ల నుంచి మూడున్నర వేల కోట్లకు పెరిగిపోయినా నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి ?’’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రస్తుత తెలంగాణ పాలకులు.. కేసీఆర్ అక్రమ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా ?’’ అని సవాల్ విసిరారు. దీనిపై విచారణ చేయాలని ‘ప్రజాపాలన’ కార్యక్రమం వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్(Maoist Party – KCR ) తెలిపారు.