Deputy CM Bhatti: అంతర్జాతీయ ప్రమాణాలతో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) అన్నారు. ఆదివారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, సామన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఉండవన్నారు. గత కొద్ది నెలల క్రితం ప్రజా ప్రభుత్వం మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేసి నిధులు కేటాయించిందన్నారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రోజున 55 పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ విద్యాశాఖ అధికారులతో విడుదల చేయించిన ఉత్తర్వులను చూపించారు.
సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, అందులో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు కూడా అక్కడే వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యా బోధన చేయడానికి డిజైన్ చేశామన్నారు.
Also Read: Milk: పాలు తాగితే బరువు పెరుగుతార.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఈ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన ల్యాబ్స్, లైబ్రరీ తో పాటు మినీయాప్ థియేటర్ కూడా ఉండేలా డిజైన్ చేసిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు, ప్రయివేటు విద్యాసంస్థల్లో లక్షలకు లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేని వారికి ఉపయోగపడుతాయన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా సిలబస్ ను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మా హాయాంలో ఏర్పాటు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సామాజిక మార్పు కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చెప్పినటువంటి మార్గ నిర్దేశకాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నదన్నారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం పోగేస్తున్న ప్రతి పైసను ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కటే సారి 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడారు. మీడియా సమావేశంలో పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారయణ, తదితరులు పాల్గొన్నారు.