మాజీ మంత్రి దానం నాగేంద్ర (Danam Nagendra) రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. ఆయన ఎటు వైపు వెళ్లబోతున్నారు? అనేది చర్చనీయాంశం గా ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. అయితే, అధిష్టానం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. పైగా రాబోవు ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఓడించడానికి పావులు కదుపుతున్నారని పార్టీ అధిష్టానం వద్ద రిపోర్ట్ ఉందట. అందుకే, నాగేంద్రను పక్కన పెట్టేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
మంత్రి పదవిని దానం నాగేంద్ర (Danam Nagendra)ఆశించారు. కానీ, హైదరాబాద్ మహానగరం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. కల్వకుంట్ల కోటరీలోని సొంత మనిషిగా తలసాని మారిపోయారు. దీంతో నాగేంద్ర వెనుకబడి పోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ (BRS) నుంచి అవకాశం వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
Also Read : KCR Drama : విశాఖ స్టీల్ ఎపిసోడ్ లో `BRS`అబద్ధాలు
తొలి నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను వ్యతిరేకించిన లీడర్లలో దానం నాగేంద్ర (Danam Nagendra)ఒకరు. ఒక వేళ రాష్ట్రాన్ని విడదీస్తే, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను చేయాలని శ్రీకృష్ణ కమిటీకి అప్పట్లో నివేదిక ఇచ్చారు. ఏనాడూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్ధతు ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాల్లోని ముద్ర. స్వర్గీయ పీజేఆర్ కు అత్యంత ఆప్తునిగా రాజకీయాల్లో ఆయన మెలిగారు. అందుకే, ఆయన్ను ఇప్పటికీ పూజిస్తారని దానం వర్గీయులు చెబుతుంటారు. ఆప్పట్లో వైఎస్, పీజేఆర్ మధ్య గ్యాప్ ఉండేది. దీంతో 2004 ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఆసీఫ్ నగర్ నుంచి గెలుపొందారు.
తొలిసారి 2004 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. యువజన కాంగ్రెస్ నాయకునిగా ఎదిగిన దానం నాగేంద్రను (Danam Nagendra)వైఎస్ దగ్గరకు తీశారు. కొన్ని నెలల వ్యవధిలోనే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఆసీఫ్ నగర్ నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గం పునర్విభజనలో ఏర్పడిన ఖైదరాబాద్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ తరపున విజయకేతనం ఎగురవేశారు. ఆ తరువాత స్వర్గీయ వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఎదిగారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖైదరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్. తరపున పోటీ చేసిన ఖైదరాబాద్ నుంచి గెలుపొందారు. అయితే, ఎలాంటి ప్రాధాన్యం లేని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఆయన(Danam Nagendra) అనుచరులు ఒకానొక సందర్భంలో ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. అయితే, అదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైదరాబాద్ నుంచి ఆమెను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపడానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే, దానంకు దాదాపుగాకాంగ్రెస్ నుంచి అవకాశం ఉండదు. ఇక బీజేపీ వైపు వెళ్లాలన్నా, ఖైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి అవకాశంలేదు. కారణం, అక్కడ చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన్ను కాదని బీజేపీ ఇతరులకు టిక్కెట్ పరిస్థితి లేదు. ఇలాంటి పరిణామాల నడుమ వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ వైపు వెళతారా? అనే టాక్ కూడా ఉంది.
Also Read: BRS: బీఆర్ఎస్కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర పార్టీ హోదా రద్దు
స్వర్గీయ వైఎస్ ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు దానం నాగేంద్రకు (Danam Nagendra) ఉన్నాయి. అందుకే, అటు వైపు వెళతారా? అనేది కూడా చర్చల్లో ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన పరిధిలో ఫలితాలు ఆశించిన విధంగా రాలేదని బీఆర్ఎస్ (BRS) అధిష్టానం చులకనగా చూస్తోందని తెలుస్తోంది. అందుకే, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని టాక్. సామాజికవర్గం, క్యాడర్, సొంత ఇమేజ్ అన్నీ ఉన్నా ఈసారి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? అనే సందిగ్ధంలో ఆయన ఉన్నారని అనుచరుల్లో నడుస్తోన్న చర్చ.
Also Read : Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `కల్వకుంట్ల`తో అంతే.!