CPI Narayana : ర‌నౌత్ పై నారాయ‌ణ `లెఫ్ట్ రైట్`

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఈ మ‌ధ్య సినిమా, సీరియ‌ళ్లు, టీవీ ప్రోగ్రామ్ ల మీద ఒంటికాలు మీద లేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ న‌టీ కంగ‌నా ర‌నౌత్ మీద విరుచుకుప‌డ్డాడు. ఆమెతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల‌ను కూడా క‌లిపేసి ధ్వ‌జ‌మెత్తాడు.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 04:41 PM IST

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఈ మ‌ధ్య సినిమా, సీరియ‌ళ్లు, టీవీ ప్రోగ్రామ్ ల మీద ఒంటికాలు మీద లేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ న‌టీ కంగ‌నా ర‌నౌత్ మీద విరుచుకుప‌డ్డాడు. ఆమెతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల‌ను కూడా క‌లిపేసి ధ్వ‌జ‌మెత్తాడు. ఇంత‌కీ ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణం ఏమిటో తెలుసా…1947లో దేశానికి వ‌చ్చిన స్వాతంత్ర్యాన్ని బ్రిటీష్ వాళ్లు వేసిన భిక్ష‌గా కంగ‌నా వ్యాఖ్యానించింది. నిజ‌మైన స్వాతంత్ర్యం 2014లో మోడీ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత మాత్ర‌మే దేశానికి ల‌భించింద‌ని ర‌నౌత్ రంకెలేసింది. ఇంకేముంది ఇండ్లీ, కోడి కూర మీద సెటైర్లు వేసే నారాయ‌ణ కంగ‌నా ర‌నౌత్ ను క‌డిగేశాడు. భావ‌దారిద్రంతో కంగ‌నా మాట్లాడుతోంద‌ని ఫైర్ అయ్యాడు. ఆమెకు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డును ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు, అవార్డును ఇచ్చిన బీజేపీ ప్ర‌భుత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ ను త‌ప్పుబ‌డుతున్నాడు. కంగ‌నా అవార్డుకు ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఏంటా? అని కొంద‌రు ఆలోచిస్తున్నారు. బ‌హుశా బీజేపీకి అనుబంధం సంస్థ‌గా ఆర్ఎస్ఎస్ ను భావిస్తూ నారాయ‌ణ అలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అనుకుందాం.

Also Read : Apex Council : కేసీఆర్ అబ‌ద్ధాల‌పై కేంద్రం ఫోక‌స్ 

ఇటీవ‌ల సీరియ‌ళ్లు, టీవీ ప్రోగ్రామ్ ల మీద కూడా నారాయ‌ణ మండిప‌డుతున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ మీద ఆయన ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ షో మీద నారాయ‌ణ హ‌ల్ చ‌ల్ చేశాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బిగ్ బాస్ షోపైన రోజూ కామెంట్లు చేసి అల‌సిపోయాడు. సామాజిక అంశాల‌పై సీరియ‌ళ్లు, సినిమాలు, షోలు ఉండాల‌ని ఆయ‌న ఉవాచ‌. కానీ, అందుకు భిన్నంగా స‌మాజాన్ని త‌ప్పుడు మార్గం పట్టించేలా చేస్తున్నార‌ని నారాయ‌ణ అస‌హ‌నం. అందుకే, సినిమా వాళ్లంట‌నే ఆయ‌న‌కు వ‌ళ్లు మండుతోంది. ఆ స‌మ‌యంలోనే స‌రిగ్గా కంగ‌నా ర‌నౌత్ వ్యాఖ్య‌లు ఆయ‌న కంట ప‌డ్డాయి. ఇంకేముంది ప‌చ్చిగాప‌చ్చిగా ర‌నౌత్ తో పాటు బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను పొట్టుపొట్టు చేశాడు.
ఇటీవ‌ల వివాద‌స్పద న‌టిగా కంగ‌నా ర‌నౌత్ సోష‌ల్ మీడియాతో పాటు అన్ని ప్లాట్ ఫారాల మీద నిల‌బ‌డింది. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల క్ర‌మంలో ఆమె వివాద‌స్ప‌ద తెర‌మీద‌కు వ‌చ్చింది. బాలీవుడ్ లోని నెపోటిజంపై ర‌నౌత్ చేసిన కామెంట్లు దుమారాన్ని రేపాయి. ఆ త‌రువాత వ‌రుస‌గా అక్క‌డి ప్ర‌భుత్వంపైన విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ప‌లు అవార్డులు, రివార్డుల‌తో పాటు ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీతగా పేరున్న ఆమె ఇలా వివాద‌స్పద అంశాల్లో త‌ర‌చూ నిల‌బ‌డుతోంది. నెటిజ‌న్లు ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ ఆమె వాల‌కంలో మార్పు రాలేదు. ఇదంతా ఆమెకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మ‌ద్ద‌తు ఇస్తోన్న కార‌ణంగా జ‌రుగుతోంద‌ని ప్ర‌త్య‌ర్థుల భావ‌న‌.
కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందని కంగ‌నా ర‌నౌత్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆమె అభిప్రాయం. ఈ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీవ్ర విమర్శలు ఆమెపై వెల్లువెత్తుతున్నాయి.బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు. దేశ వ్యాప్తంగా ర‌నౌత్ మీద విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆమె వ్యాఖ్య‌ల‌ను నారాయ‌ణ సీరియ‌స్ గా తీసుకున్నాడు. ఆమెపైన విమ‌ర్శ‌ల వ‌ర‌కు ప‌రిమితం అవుతాడా? లేక బిగ్ బాస్ మీద పోరాటం చేసిన‌ట్టు చేస్తాడా? అనేది చూద్దాం.