T Congress : తెలంగాణ‌ కాంగ్రెస్‌లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క్లారిటీతో ఉన్న హైక‌మాండ్‌

తెలంగాణలో ఎన్నిక‌ల స‌మీపిస్తున్నందున రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌పై

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 03:30 PM IST

తెలంగాణలో ఎన్నిక‌ల స‌మీపిస్తున్నందున రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల స‌ర్వేల‌తో హైక‌మాండ్ వ‌ద్ద అభ్య‌ర్ధుల లిస్ట్ ఉన్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌పై కాంగ్రెస్ అధిష్టానం గురిపెట్టింది. ఎలాగైన తెలంగాణ‌లో గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ హైక‌మాండ్ ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీలోని నేతల వ్యవహార శైలి పైన కన్నేసింది. రాష్ట్రంలో పార్టీకి వాతావరణం అనుకూలగా మారుతున్న వేళ ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకుటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, నేతల వ్యాఖ్యలపైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది. పార్టీ మేనిఫెస్టో మొదలు టికెట్ల ఖరారు పైనా తాజాగా పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని క్లారిటీ ఇచ్చింది.

ఇదే సమయంలో టికెట్ల పైన ఎవరు హామీ ఇచ్చినా అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్ దేనని నేతలకు తేల్చి చెప్పింది. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి పార్టీ సిద్ధంగా లేదు. ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా మినిట్ టు మినిట్ పార్టీ వ్యవహారాలపైన మైక్రో లెవల్ నుంచి సమాచారం సేకరిస్తోంది. టీపీసీసీ చీఫ్ తో సహా ఏ స్థాయి నేత అయినా పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో గత తొమ్మిదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగిన అంశాన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు ఇచ్చాయి. దీనికి అనుగుణంగా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందిరికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ సిద్ధం అవుతోంది. పేదలు, మధ్య తరగతి, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో పార్టీ టికెట్ల పైన కొందరు నేతలు హామీలు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కొందరు ముఖ్య నేతలు తామే టికెట్లు ఇప్పిస్తామంటూ చెబుతున్న మాటలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఖరాఖండిగా పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పింది. నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. నేతల వారసులకు కాని, అనుచరులకు కాని టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటూ పార్టీ నాయకత్వం కుండ బద్దలు కొట్టింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే గెలుపు మాత్రమే లక్ష్యంగా టికెట్ల ఖరారు ఉంటుందని తేల్చేసింది.