Congress : బీఆర్ఎస్‌ను కుదిపేస్తున్న కాంగ్రెస్ “గ్యారెంటీ”

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు "గ్యారంటీ"

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 07:49 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. సీఎల్పీ నేత భట్టి పాద‌యాత్రతో మొదలై.. ఖమ్మంలో తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్‌గా చేస్తుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేసారు. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది. ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్.. అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.