MLC Kavitha: జంతర్ మంతర్ వద్ద మళ్లీ ధర్నా చేస్తా, సోనియా, స్మృతిలను పిలుస్తా: ఎమ్మెల్సీ కవిత

మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

  • Written By:
  • Updated On - August 23, 2023 / 04:18 PM IST

హైదరాబాద్ : మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకటేనని మండిపడ్డారు. 2010 రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ 2014 వరకు అధికారంలో ఉన్న కూడా లోక్సభలో ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. గత పదేళ్ల కాలంలో మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీని సోనియాగాంధీ ప్రియాంక గాంధీ ఎందుకు నిలదీయలేదని అడిగారు. ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి తాను జంతర్మంతర్లో ధర్నా చేస్తానని, ఆ ధర్నాకు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నీ సైతం ఆహ్వానిస్తానని ప్రకటించారు.

బుధవారం రోజున హైదరాబాదులోని తన నివాసంలో కవిత విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళా బిల్లు కోసం తాను ధర్నా చేసిన సమయంలో స్పందించని పార్టీలు, నాయకులు స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంత మంది నాయకులు స్పందించారంటే మహిళా బిల్లు అంశానికి ప్రాధాన్యత ఉందని అర్థమవుతోందన్నారు. కానీ ఆ రాజకీయ పార్టీలు మహిళా బిల్లుపై శ్రద్ధ చూపించడం లేదని నిన్నటితో స్పష్టమైందని చెప్పారు. ఇది కేవలం మహిళలకు ఏ పార్టీ ఎన్ని టికెట్లు ఇచ్చిందన్నదానిపై కొట్లాటకాదని, స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేన్నదని ప్రధాన అంశమని స్పష్టం చేశారు. వాటి గురించి మాట్లాడకుండా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న కవిత ఉన్న బీఆర్ఎస్ టికెట్లు సరిపడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారని, కానీ ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, 140 కోట్ల మంది జనాభాలో 70 కోట్ల మంది అడబిడ్డలు ఉన్నారని, వారి భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు మహిళలు రాజకీయ ప్రక్రియలో పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ఇవాళ దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 14 లక్షలకుపైగా మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారని ప్రస్తావించారు. మరి అసెంబ్లీ, పార్లమెంటులో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు కాబట్టే ఈ 14 లక్షల మందికి అవకాశాలు లభించాయని చెప్పారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చినప్పుడు కూడా చాలా వ్యతిరేకత వచ్చిందని, చాలా మంది ముఖ్యమంత్రులు ఒప్పుకోలేదని, కానీ ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం ప్రయోగాత్మకంగా అమలు చేయడం వల్ల ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో తప్పా ప్రతీ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలుగుతున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పురుషాధిక్య సమాజమే ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, కానీ అదేదో తన ఇంటి విషయమన్నట్లు, వ్యక్తిగత అంశమన్నట్లు అన్ని పార్టీలు విరుచుకుపడడం బాధాకరమన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం, మహిళలకు ఆస్తి హక్కు కోసం అంబేద్కర్ కూడా పోరాటం చేసినప్పుడు అవహేళన చేశారని, రాజీనామా చేసే పరిస్థితులు కల్పించారని, మహిళా హక్కుల గురించి మాట్లాడినప్పుడు ఎంత వ్యతిరేకత ఉంటుందన్నది కొత్త అంశంకాదని అన్నారు. కానీ ఇప్పటికీ పార్టీలు సంకుచితంగా ఆలోచించడం, మరీ ముఖ్యంగా పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. అంశాన్ని పక్కదారిపట్టించే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నాయన్నారు.

జవహార్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఒక మహిళా మంత్రి మాత్రమే ఉండేవారని, ఇప్పుడు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఇద్దరు మాత్రమే ఉన్నారని, అంటే 75 ఏళ్లలో 50 శాతం పెరిగిందని సంతోషపడాలా లేదా అప్పుడు ఒక మహిళా మంత్రి ఉంటే…. ఇప్పుడు ఇద్దరే ఉన్నారని బాధపడాలా అని ప్రశ్నించారు. దీన్ని ఏ కోణంలో ఆలోచించాలన్నదానిపై సమాజం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో కేవలం 12 శాతం మహిళలు మాత్రమే ఉన్నారని, 75 ఏళ్లలో మనం సాధించిన పురోగతి కేవలం 8 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది తన ఇంటి సమస్యకాదని, ఇది దేశ మహిళల సమస్య అని చెప్పారు. మణిపూర్ మొట్టమొదటిసారి ఇద్దరు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, అంటే ఇప్పటి వరకు ఆ రాష్ట్ర శాసన సభలో మహిళా అడుగుపెట్టనే లేదన్నారు. హర్యానలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేక పోటీ చేయడానికి 10 వ తరగతి చదివి ఉండాలని చట్టం తీసుకొచ్చారని విమర్శించారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా మరో బీజేపీపాలిత హర్యానలో మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన మహిళా నాయకులు తనపై విరుచుకుపడుతున్నారని, దీని వల్ల ఎవరికి లాభమన్నది బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలా అవహేళగా మాట్లాడారన్నారు. 1996లో దేవే గౌడ ప్రభుత్వంలో తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, ఆనాటి నుంచి 2010 వరకు పలుసార్లు ప్రయత్నాలు జరిగాయని, కాంగ్రెస్ ఒక సారి ప్రయత్నం చేసి విఫలమయ్యిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో 2010లో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు 2023లోకి వచ్చినా లోక్ సభలో బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదని ప్రశ్నించారు. దానిపై ఈ 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందని అడిగారు. 2010 నుంచి 2014 వరకు అధికారంలోనే ఉన్న కాంగ్రెస్ కు మహిళా బిల్లు గుర్తుకురాలేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో దానిపై సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడలేదని నిందించారు. తాను జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తేనే అందరికీ మహిళా బిల్లు గుర్తుకొచ్చిందన్నారు.

ధర్నా చేసిన తనను ప్రశ్నిస్తారా లేదా బిల్లును ఆమోదించాల్సిన ప్రధాని మోడీని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. ఎప్పుడైనా ఏ అంశంపై అయినా ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి విమర్శించడాన్ని చూశారా అని అడిగారు. మహిళల హక్కుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొందుదొందేనని మండిపడ్డారు. చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ కలుగుతుందని, అప్పుడే మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని, కానీ చట్టం చేసే ఉద్ధేశం ఆ రెండు పార్టీలకు లేదని నిరూపించున్నాయని స్పష్టం చేశారు. చట్టం వస్తేనే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతందని, కాబట్టి చట్టం కోసం పోరాటం చేద్దామని మహిళలకు పిలుపునిచ్చారు. డిసెంబరులో జంతర్ మంతర్ వద్ద మరోసారి భారీ ధర్నా నిర్వహిస్తానని, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు బీజేపీ నాయకురాలు డీకే అరుణ నుంచి స్మృతీ ఇరానీ వరకు అందరినీ ఆహ్వానిస్తానని ప్రకటించారు. ఎవరెవరు వస్తారో ఎవరు రారో… బీజేపీ బిల్లు పెడుతుందా … దానికి కాంగ్రెస్ మద్ధతిస్తుందా అన్నది దూద్ కా దూద్ పానీ కా పానీ అప్పుడు అవుతుందని తెలిపారు.

ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని తాను సీరియస్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. తమ పార్టీ న్యాయ విభాగం తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. భయాందోళనలు రేపేతట్టుగా ఒక సామాజికవర్గం పేరును తీసుకొని నోటాకు ఓటేయాలని మాట్లాడడం శోచనీయమన్నారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఎల్ బీ నగర్ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. భవిష్యత్తులో పునరావృతంకాకుండా చర్యలకు ఉపక్రమించామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా తమ పార్టీని ఆశీర్వదిస్తారన్నారు. మైనంపల్లి హనుమంత రావు చేసిన వ్యాఖ్యలను తాను ఇప్పటికే ఖండించానని అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస బాధ్యత అని సూచించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా తెలుసని, కాబట్టి అమలుకు సాధ్యంకానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి తప్పుడు హామీలే ఇచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించలేదని, తాము రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా ప్రజలు తమను గెలిపించారన్ని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అదే జరగబోతుందని స్పష్టం చేశారు. తాము అమలుకు సాధ్యంకానీ హామీలేమీ ఇవ్వలేదని, ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తారని తెలిపారు. అలాగే, కేసీఆర్ కు భయం అంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేనన్ని రిస్కులు కేసీఆర్ తీసుకున్నారని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ నుంచి కేసీఆర్ గెలుపొందారని, వ్యూహాత్మకంగానే కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగారన్నారు.

Also Read: Gadar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాస్తున్న గదర్ 2, 12 రోజుల్లో 400 కోట్లు!