CM Revanth Vs KCR : కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు.. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త..’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని పిట్టలదొర కేసీఆర్ అంటుండు.. అదేమైనా నువ్వు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి’’ అని విమర్శించారు. శనివారం మెదక్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
‘‘దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారు.. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాల పాటు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ చేతిలోనే ఉంది.. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప… బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదు.. పదేళ్ల బీఆరెస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదు’’ అని సీఎం రేవంత్(CM Revanth Vs KCR) చెప్పారు. ‘‘దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్ రావును అడుగుతున్నా.. మేమంతా బస్సులేసుకుని దుబ్బాకకు వస్తాం.. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏంటో చూపించు’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘పదేళ్ల పాటు మోడీ ప్రధానిగా ఉన్నారు.. కేసీఆర్ సీఎంగా ఉన్నారు..ఈ పదేళ్లలో వీళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలి’’ అని రేవంత్ తెలిపారు. ‘‘కేసీఆర్ పని అయిపోయింది.. కారు కార్ఖానాకు పోయింది.. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందే’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్ ప్రకటించారు. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత తనది అని తెలిపారు. ‘‘పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, హరీష్ హామీలు నెరవేర్చలేదు.. కానీ వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు. మరో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం’’ అని ఆయన చెప్పారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు బీఆరెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని రేవంత్ ఆరోపించారు. ‘‘మోడీ, కేడీ తోడు దొంగలు.. డిసెంబర్ లో కేడీని ఇంటికి పంపించాం.. ఇక ఇప్పుడు మోడీని ఇంటికి పంపించాలి’’ అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.