CM Revanth Reddy: తెలంగాణలో వర్షాల పరిస్థితులు, వ్యవసాయ రంగం, రేషన్ కార్డుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. సీఎం మాట్లాడుతూ.. జూన్ నుండి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే 150 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సమన్వయం చేసుకుని ముందే బృందాలను పంపిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్లో ఉండాలని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని, అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ప్రతిరోజు తమ కార్యాచరణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్ను ఆదేశించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు.
Also Read: Rajya Sabha: జాతీయ సైబర్ భద్రత బలోపేతంపై రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన!
రాష్ట్రం 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి సరైన వాటర్ మేనేజ్మెంట్ ఉండాలని సూచించారు. యూరియా స్టాక్కు సంబంధించి ప్రతి ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు ఎరువుల కొరత ఉన్నట్లు కృత్రిమంగా సృష్టిస్తున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా స్టాక్ ఉందని స్పష్టం చేశారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని నొక్కి చెప్పారు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదులకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రేషన్ కార్డుల పంపిణీ
రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి లేకపోయినా సన్న బియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని, రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగిందని అన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కో-ఆర్డినేట్ చేసుకోవాలని, ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు.