CM Revanth Reddy : కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావు కలిసి బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. పూర్తిగా బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదలాయించి కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తానంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బూడిదైన బీఆర్ఎస్ ఇక మళ్లీ పుట్టేది లేదన్నారు. ఇవాళ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్రావు తమ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదలాయించారు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారు’’ అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆరోపించారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ బీజేపీని కేసీఆర్ గెలిపించారన్నారు.
‘‘కేసీఆర్ బీజేపీతో బేరసారాలు చేస్తున్నాడు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు.. ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు అని చెబుతూ వచ్చిన బీజేపీ.. బీఆర్ఎస్తో ఎలా జతకడుతుందో చూడాలి’’ అని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల్లోనే తమపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ‘‘ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం.. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది’’ అని ఆయన తెలిపారు.
‘‘ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు.. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది. మాకు 41 శాతం ఓట్లు వచ్చాయి’’ అని సీఎం రేవంత్ వివరించారు.