Irrigation Projects : గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన జల ప్రాజెక్టుల వివరాలన్నీ సమర్పించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులకు అయిన ఖర్చుల లెక్కలతో కూడిన కంప్లీట్ డీటెయిల్స్ను తనకు అందించాలని నిర్దేశించారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వివరాలను అందించాలన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, వెంకటేశ్వర్లు సహా ఇతర ఇంజినీర్లతో సీఎం రేవంత్ తన నివాసంలో సమావేశమయ్యారు. యాసంగిలో పంటలు వేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు(Irrigation Projects) ఇప్పట్లో పూర్తవడం కష్టమేనని ఇంజినీరింగ్ అధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి మరో రెండు నెలల పాటు ప్రవాహం ఉండనుండగా తర్వాత మిగిలేది మూడు, నాలుగు నెలలేనని అంచనావేస్తున్నారు. పునరుద్ధరణ పనులపై ఎల్అండ్టీ తమ బాధ్యత కాదని తేల్చేయడంతో ఈ సమయంలో పనులు పూర్తికావని భావిస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే నీళ్లు నిల్వ చేస్తే అసలుకే ప్రమాదం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.