Aramghar : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ను సోమవారం ప్రారంభించారు. నగరం నుంచి బెంగుళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకూ 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ తర్వాత నగరంలో రెండో అతి పెద్ద వంతెన కావడం విశేషం.
దీనిని ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన అతి పొడవైన ఫ్లై ఓవర్ ఇది. పాతనగరంలో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా..ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్తో శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, శివరాంపల్లి, హసన్నగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనున్నది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడనున్నది.
నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పైవంతెనలు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తోంది. హైదరాబాద్లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్రఇబ్బంది పడటమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృథా అవుతోంది. నగరంలోని ముఖ్యప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మకరహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది.
Read Also: Viyona Fintech : హైదరాబాదీ కంపెనీ జోష్.. ‘వియోనా పే’, ‘గ్రామ్ పే’ విడుదల