CM Revanth: సీఎం రేవంత్ తో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ

  • Written By:
  • Updated On - January 12, 2024 / 11:06 AM IST

CM Revanth: ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్స్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన శ్రీ సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్స్ తయారు చేసే సంస్థల్లో అతి పెద్దది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నివాసంలో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (పీఎస్‌ఐఎల్‌-24) కార్యక్రమం గురించి సిఎంకు బృంద సభ్యులు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలల బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందాన్ని సిఎం కోరారు.

జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సహకారంతో హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాల నుండి ఉన్నత పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు 5 రోజులపాటు సైంటిఫికల్లీ ఇన్‌స్పైర్డ్‌ లీడర్‌షిప్‌ (పీఎస్‌ఐఎల్‌-24) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అధ్యాపకులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండీ రైట్ తదితరులు పాల్గొన్నారు.