సంక్షోభ సమయంలో సంయమనం పాటించాలి. అప్పుడే లీడర్ గా ఎదగగలరు అనేది చాణక్యుడు సూత్రం. దాన్ని ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సొంత పార్టీ నేతలను వేటాడుతోన్న సమయంలోనూ బీజేపీని దెబ్బతీసే ప్రయత్నాలను ఆయన ఆపలేదట. చాపకిందనీరులా ప్రగతిభవన్ కేంద్రంగా బ్లూప్రింట్ ను అమలు చేయడానికి పావులు కదుపుతున్నారని వినికిడి. ఆయన బ్లూ ప్రింట్ ప్రకారం సొంత పార్టీ నేతలను కాపాడుకోవడానికి `నైతికత` మంత్రాన్ని జపిస్తున్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే వాళ్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు బీజేపీలోని కీలక నేతలను టచ్ చేస్తూ మోడీ, షా ద్వయానికి చుక్కలు చూపించే ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన తరుణంలో నాయకత్వ లక్షణాలున్న వాళ్లను ఎవర్నీ వదలకుండా తీసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన శ్రావణ్ కుమార్ ను రెండు వారాలలోపే టీఆర్ఎస్ గూటికి వచ్చేలా చేశారు. ఉద్యోగ సంఘం మాజీ నాయకుడు, ఉద్యమకారుడు, బీజేపీ నేత స్వామిగౌడ్ గులాబీగూటికి చేరారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి పల్లె రవికుమార్ లాంటి లీడర్లను కారు పార్టీ ఆకర్షించింది. ఇదంతా కేసీఆర్ బ్లూ ప్రింట్ లో భాగం. దాన్ని వేగంగా అమలు చేయడానికి సిద్దమైన టైమ్ లో కేంద్ర దర్యాప్తు సంస్ధలు టీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి రేపాయి. అయినప్పటికీ బ్లూ ప్రింట్ అమలు మాత్రం శాశ్వతంగా ఆగలేదు.
Also Read: Dalith Bandhu : దళితబంధు నిలిపివేత! ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్లాన్!
ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేంద్ర పై గులాబీ బాస్ భారీ స్కెచ్ వేశారు. ఆయన్ను తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని డిప్యూటీ సీఎం ఇస్తారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. దానిపై ఈటెల ఎంత ఖండించినప్పటికీ ప్రచారాన్ని హోరెత్తించారు. దానికి కౌంటర్ గా కేసీఆర్ కుమార్తె కవిత బీజేపీలోకి వస్తున్నారని లేదా కాంగ్రెస్ లోకి వెళుతుందని ప్రచారాన్ని కమలనాథులు ప్రారంభించారు. అంతేకాదు, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసే వరకు కవిత ఇష్యూ వెళ్లింది. ఫలితంగా రాజేంద్రపై చేపిన ఆపరేషన్ తాత్కాలికంగా ఆగింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు అలజడి సృష్టిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం గ్రాండ్ ఘర్ వాపసీ మీద సీరియస్ గా దృష్టి పెట్టారని సమాచారం. అందులో భాగంగా బీజేపీలోని కొందరు సీనియర్లు గులాబీ గూటికి చేరడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఇద్దరు సీనియర్లపై చేసిన ఆపరేషన్ పూర్తయిందని సర్వత్రా వినిపిస్తోంది. ఐటీ దాడుల హడావుడి తగ్గిన తరువాత ఆ ఇద్దరు టీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది. మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలకు పోటీగా సిట్ ను వేగంగా ముందుకు కదుపుతూ `ఆపరేషన్ బ్లూ ప్రింట్` ను మాత్రం కేసీఆర్ వదల్లేదని గులాబీ దళంలోని టాక్. ఎంత వరకు లక్ష్యాన్ని కేసీఆర్ చేరుకుంటారో చూద్దాం.
Also Read: TRS : 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు