MLC Kavitha: కల్లు దుకాణాలను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్ ది: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 11:27 AM IST

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అహంకారానికి ఆత్మీయతకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని అన్నారు. ఎవరు కావాలన్నది ఆలోచన చేసి ప్రజలు నిర్ణయించాలని కోరారు. చెప్పులు విడిచి ఇంట్లోకి రండి అనే వ్యక్తులు కాంగ్రెస్ నాయకులని ధ్వజమెత్తారు. రైతులకు రైతు బంధు ఇస్తుంటే రైతులకు బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకని… 3 గంటల విద్యుత్తు చాలదా అని కూడా రేవంత్ రెడ్డి అహంకారంతో అన్నారని ఎండగట్టారు. విద్యార్థి నాయకులను అడ్డమీది కూలీలని రేవంత్ రెడ్డి దూషించారని, ఎంత అహంకారం ఉంటే ఇన్ని మాటలు అంటారని ప్రశ్నించారు.

బోధన్ నియోజకవర్గం గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ ను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌడ కులస్తులను విస్మరించారని, నిర్లక్ష్యం చేశారని అన్నారు. కలులు అంటేనే అప్పుడు ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని, హైదరాబాద్ లో కల్లు దుకాణాలను మూసివేయించారని గుర్తు చేశారు. ఆంధ్రా పాలకులు అహంకారంతో ఇలా చేశారని, అప్పుడు మంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కూడా వత్తాసు పలికారని విమర్శించారు. దాంతో అనేక ఇబ్బందులు పడుతున్న గౌడలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ మేరకు దుకాణాలను పునరుద్ధరించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి, ముదిరాజుల పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఒక్క రూపాయి అయినా కాంగ్రెస్ పాలనలో ఇచ్చారా చెప్పాలని కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామదేవతల ఆలయాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.

ప్రతీ కులవృత్తిని గౌరవించుకుంటేనే సమాజం బాగుటుందన్నది సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని స్పష్టం చేశారు. హరితమారం కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్లు నాటించారని తెలిపారు. జిల్లాకు 5 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేసినా ఏకైక ప్రభుత్వం మనదేనని తేల్చిచెప్పారు. చెట్లపై పన్నును ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నోటి మాటకు హామీలు ఇవ్వడం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసి సీఎం కేసీఆర్ చూపించారన్నారు. కల్లు దుకాణాలను పునరుద్ధరించడం వల్ల నేరుగా70 వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌడ కులస్తులకు ఆత్మగౌరవాన్ని కల్పించారని వివరించారు. మీది మీది మాటలు మస్తు మంది చెబుతారని, కానీ ఆర్థికంగా నిలబెట్టిన వాళ్లే మనవాళ్లవుతారని, అటువంటి వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలియజేశారు. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. బోధన్ ప్రాంతంలో అదనంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి కూడా సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్ కు వచ్చి పోతారని, షకీల్ మాత్రం స్థానికంగానే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు. షకీల్ ముస్లీం వర్గానికి చెందినా కూడా దసరా వస్తే ఎంతో మంది హిందూ మహిళలకు చీరలను పంపిణీ చేస్తుంటారని, దీపావళి వస్తే ప్రతీ కుటుంబానికి పలకరిస్తారని, రంజాన్, క్రిస్మస్ పండగలనూ అంతే ఘనంగా నిర్వహిస్తారని కొనియాడారు. గంగా జమునా తెహజీబ్ ఇదేనని అన్నారు. ప్రశాంతగా ఉంటే సమాజం బాగుటుందని, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మతకల్లోలం జరగలేదని స్పష్టం చేశారు. ఒక్క గొడవ కూడా కాలేదు కాబట్టే అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ కు వచ్చారని, దాదాపు 22 వేల కంపెనీలు హైదరాబాద్ లో స్థాపించాయని, దాదాపు 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి పాలనలో కేవలం 2 బీసీ హాస్టళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 23క చేరుకున్నాయని, ఎంతో మంది బీసీ బిడ్డలు బాగా చదువుకోవాలన్న ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ ఇవన్నీ చేశారని చెప్పారు.