Site icon HashtagU Telugu

KCR: ఊరువాడ కేసీఆర్ బర్త్ డే

CM KCR birthday

CM KCR birthday

తెలంగాణ సిఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలోనూ ఆయన పుట్టిన రోజును వినూత్నంగా జరిపారు. ఈ సారి మూడు రోజుల పాటు కేసీఆర్ బర్త్ డే వేడుకలు చేశారు. ఆయన 68 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సామాజిక కార్యక్రమాలను అభిమానులు పెద్దఎత్తున చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2022, ఫిబ్రవరి 17వ తేదీ నాటికి 68 ఏట అడుగు పెట్టాడు. ఆయన బర్త్ డేను ఘనంగా నిర్వహించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. జన్మదిన సంబరాలను మూడు రోజుల పాటు సేవా దృక్పథాన్ని చాటుకొనేలా సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. 2022, ఫిబ్రవరి 15వ తేదీ మంగళవారం నుంచి మూడురోజుల పాటు సేవా కార్యక్రమాలు టీఆర్ఎస్ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 15న అన్నదాన కార్యక్రమం, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు., 17న జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. పార్టీ శ్రేణులు సేవా దృక్పథాన్ని చాటేలా ఆసుపత్రులు, వృద్థాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేశారు.

ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి 17 వరకు ఎల్బీ స్టేడియంలో మహిళలు, పురుషుల విభాగాల్లో వాలీబాల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ రాజకీయం ఘట్టాలు

-సిద్ధిపేట‌లోని రాఘ‌వ‌పూర్ ప్ర‌ధాన వ్య‌వ‌సాయ కో-ఆప‌రేటిప్ సొసైటీకి చైర్మ‌న్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తించారు.

-అభిమాన నటుడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడంతో కాంగ్రెస్‌ను వదిలి వచ్చేశారు. 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

-1989, 1994, 1999, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక. తొలిసారిగా 1987-88లో మంత్రి అయ్యారు.

-1989-1993 వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా కొన‌సాగారు.

-1999లో ఆంధ్రప్రదేశ్‌ ఉప శాసన సభాపతిగా ఉన్నారు.

-1999లో చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసంతృప్తి టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు దారి తీసింది.

-చంద్రబాబు తీరుకు నిరసనగా 2001 ఏప్రిల్‌ 21న డిప్యూటీ స్పీకర్‌ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

– ఏప్రిల్‌ 27న ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు.

-2003లో న్యూ స్టేట్స్ నేష‌న‌ల్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు.

-2004 ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేశారు. కరీంనగర్‌ నుంచి ఎంపీగా విజయం.

-యూపీఏ-1 హయాంలో 2004-06 కాలంలో తొలిసారి కేంద్ర మంత్రి. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మంత్రిగా, కరీంనగర్‌ ఎంపీగా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన కరీంనగర్‌ ఉప ఎన్నికలో కేసీఆర్‌ రెండు లక్షల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు.

-2009లో మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో కొట్లాడారు.

-2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్ష చేసి పది రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారు. డిసెంబర్‌ 9న కేంద్రం ప్రకటనతో దీక్ష విరమించారు.

-జూన్ 2, 2014న ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ (గజ్వేల్‌ ఎమ్మెల్యే) బాధ్యతలు చేపట్టారు.

-2018 సెప్టెంబ‌ర్ 6వ తేదీన అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. -రెండోసారి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టారు

-జననం 17 ఫిబ్రవరి, 1954. స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకగా పేర్కొంటారు. కానీ వారి పూర్వీకులది చింతమడక కాదు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో వారి భూమి కోల్పోవడంతో చింతమడకకు వలస వచ్చారు. అందుకే జలాశయాల కోసం భూ సేకరణ జరిగినప్పుడుల్లా తాము భూ నిర్వాసితులమేనని కేసీఆర్‌ చాలాసార్లు గుర్తు చేశారు.

-కేసీఆర్‌‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు.

-సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ డిగ్రీ పట్టా పొందారు.

-కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ ప్రవేశం. మెదక్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక నేతగా మారారు.

-పదిహేన్నేళ్ల వయసులో.. 1969, ఏప్రిల్‌ 23న శోభతో వివాహం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు. అయితే అదే విశ్వవిద్యాలయ శత వసంతాల వేడుకలను పూర్వ విద్యార్థి అయిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించడం విశేషం.

-కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువ. తరచూ యాగాలు చేస్తుంటారు. అందుకే దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించారు. యాదాద్రిని అద్భుత రీతిలో తీర్చిదిద్దుతున్నారు. దాదాపు రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేస్తున్నారు.

-తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గకు ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించినట్లు కేసీఆర్‌ తెలిపారు.

-కేసీఆర్‌కు ఎన్టీఆర్, అమితాబ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఘంటసాల పాటలంటే ప్రాణం, ఆ పాటలు విని మంచిమూడ్‌లో వాటిని ఎదుటివారికి వినిపించడమంటే ఆయనకు ఇష్టం.

-పుస్తక ప్రియుడు. సాహిత్య పుస్తకాలు విపరీతంగా చదువుతారు. పుస్తక ప్రియులతో గంటల తరబడి చర్చల్లో గడుపుతారు. ఓల్గా నుంచి గంగ వరకు ఎన్నెన్నో పుస్తకాలను చదివినట్టు ఆయన పలు సందర్భాల్లో తెలిపారు. దూర ప్రయాణాల్లో కారు డ్రైవింగ్‌ చేయడం ఆయనకో సరదా.

నిత్యం అన్ని పత్రికలు చదివాకే పనిలోకి వెళ్తారు. గల్లీ నుంచి ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా తెలుసుకుంటారు.

-రాజకీయ తొలి గురువు మదన్ మోహన్. గురువుపైనే పోటీ చేసి కేసీఆర్‌ గెలిచారు.

-కూతురు కవిత అంటే కేసీఆర్‌కు ఎంతో ఇష్టం. కవిత పుట్టాకే రాజకీయాల్లో కలిసొచ్చిందని గట్టి నమ్మకం. అందుకే విదేశాల్లో ఉన్న కవితను పిలిపించారు. ఆమెను నిజామాబాద్‌ ఎంపీగా పోటీలో నిలిపి గెలిపించేలా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీని చేశారు.

-1975లో రాజకీయాల్లో బిజీ అయి కుమారుడు కేటీఆర్ తొట్టెల వేడకకు కేసీఆర్‌ ఇంటికి కూడా వెళ్లలేదు.

-ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టినా చిన్నపిల్లలకు ఇచ్చే కిట్‌కు మాత్రమే కేసీఆర్‌ తన పేరు పెట్టుకున్నారు. -ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు ‘కేసీఆర్‌ కిట్‌’ ఇస్తున్నారు.

-స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా నవంబర్‌ 29న నుంచి డిసెంబర్‌ 9వ తేదీ వరకు పది రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. ‘ఆ పది రోజులు మానేసిన అన్నం బువ్వ ప్రజలకు బోనంకుండలో బెల్లం బువ్వ అయ్యింది’ అని కవులు పాటలు పాడారు.

-కేసీఆర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లంలో మంచి పట్టు ఉంది. అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడి ప్రజలను ఆకట్టుకోవడం కేసీఆర్‌ స్టైల్‌.

-కేసీఆర్‌ ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్న సమయంలో పాడిన పద్యాలు.. కవితలు.. పాటలు, డైలాగ్స్‌ ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ పీఠంపై గురి పెట్టాడు. ప్రధాని పదవిని అందుకోవటమే లక్ష్యంగా ముందు కు అడుగులు వేస్తున్నాడు. బర్త్ డే సందర్భంగా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటూ కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.