Cloud Burst In Tadwai Forests : తెలంగాణలోని పలు జిల్లాలను ఇటీవలే భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. అయితే ములుగు జిల్లా తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల ప్రజలకు ఆగస్టు 31న సాయంత్రం ఎదురైన షాక్ వాటన్నింటి కంటే చాలా డిఫరెంట్. వరద ఎఫెక్టు పెద్దగా లేనప్పటికీ.. అక్కడి అడవుల్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ అందరినీ భయకంపితులను చేసింది. ఎందుకంటే.. దాని ఎఫెక్టుతో వందల ఎకరాల్లో అడవి ధ్వంసమైంది. అడవుల్లోని దాదాపు 204.30 హెక్టార్లలో 50 వేలకు పైగా చెట్లు కూలిపోయాయి. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది ? అదే క్లౌడ్ బరస్ట్ జనావాసాలపై సంభవించి ఉంటే వయనాడ్ తరహా విషాదాన్ని మనం చూడాల్సి వచ్చేదనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్లౌడ్ బరస్ట్కు గల కారణాలను తెలుసుకోవడంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
Also Read :Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి
ఈ అంశంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) డోబ్రియాల్ కీలక వివరాలను వెల్లడించారు. ‘‘తాడ్వాయి అడవుల్లో చెట్ల వేళ్లు లోతుగా లేవు. అందుకే క్లౌడ్ బరస్ట్ జరిగిన వెంటనే వందల ఎకరాల్లో అడవి ధ్వంసం జరిగింది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరింత లోతుగా అధ్యయనం చేయాలి’’ అని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికీ పంపించనుందని తెలుస్తోంది. తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాలలోనే క్లౌడ్ బరస్ట్ ఎందుకు జరిగింది ? దాని తీవ్రత ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది ? అనే దానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ ప్రాంతంలో మేఘాలు అంతలా కిందకు ఎందుకు వచ్చాయనేది తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), వాతావరణశాఖతో అధ్యయనం చేయిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని నిపుణులు(Cloud Burst In Tadwai Forests) చెబుతున్నారు.