CM Revanth Reddy : హైదరాబాద్లోని గాంధీభవన్లో బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దు అయినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈవిషయాన్ని ఆలోచించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆలోచించాలని సూచించారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా. ఆర్ఎస్ఎస్ విధానాన్ని బీజేపీ అమలు చేస్తోంది. రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్ల మెజారిటీ సాధించాలని మోడీ ప్రయత్నిస్తున్నారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే టార్గెట్తో ఆర్ఎస్ఎస్ ముందుకు సాగుతోంది’’ అని రేవంత్ ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కాంగ్రెస్పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే. వర్గీకరణ కోసం కొట్లాడిన వారు కూడా ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదు. రిజర్వేషన్లు వద్దు.. రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి మద్దతు ప్రకటించండి. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దు అనే అంశంపై సాగుతున్నాయి’’ అని సీఎం రేవంత్ (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. జనాభా దామాషాప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని అంటున్న రాహుల్ గాంధీకి అండగా నిలవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 14 సీట్లలో గెలిపించాలని కోరారు.
బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అగ్గి పెట్టె, సబ్బు బిల్ల, అగర్ బత్తీలపైనా మోడీ సర్కారు జీఎస్టీ విధించిందని చెప్పారు. చేనేత నుంచి కుటీర పరిశ్రమల దాకా ప్రతీ రంగాన్ని జీఎస్టీ పేరుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దోపిడీ చేసిందన్నారు. ‘‘దేశ ప్రజలపై ప్రధాని మోడీ రూ.168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. పదేళ్లలో రూ.113 లక్షల కోట్ల అప్పులు తెచ్చి భారత దేశాన్ని ఆయన తాకట్టు పెట్టారు. 60 ఏళ్లు కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మోడీ పదేళ్లలో కార్పొరేట్ లకు కట్టబెట్టారు’’ అని సీఎం రేవంత్ తెలిపారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని మోడీ.. పార్లమెంటు సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ.. కేవలం 7లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు.