Ranjith Reddy : లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని ఆయన వెల్లడించారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గురువారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, మొత్తంగా ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసేందుకు చిత్తశుద్దితో పని చేస్తోంది’’ అని రంజిత్ రెడ్డి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి, తెలంగాణకు, చేవెళ్లకు చేసిందేమీ లేదు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు నాశనమయ్యాయి. నిత్యావసరాల ధరల మంటతో పేదల బతకులు భారంగా మారాయి. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది’’ అని రంజిత్ రెడ్డి(Ranjith Reddy) వ్యాఖ్యానించారు.
‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన చేస్తామని ప్రధాని హామీ నెరవేరలేదు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కు రప్పించి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ పత్తా లేకుండా పోయింది’’ అని రంజిత్ రెడ్డి చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలతో మైనారిటీలను కేంద్రంలోని మోడీ సర్కారు భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. చేవెళ్లలో బీజేపీకి ఓటేస్తే కొరివితో తలగోక్కున్నట్టే అవుతుందన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటేస్తే… నిండా మునుగుడేనని ఓటర్లను హెచ్చరించారు.
‘‘చేవెళ్ల అభివృద్ధి కావాలంటే పేదల హస్తమైన కాంగ్రెస్కే ఓటు వేయండి’’ అని రంజిత్ రెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీశ్ గౌడ్, సీనియర్ నాయకులు ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఓటర్లను కలవనున్నారు.