సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment Board) విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ (GHMC) లో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. విలీనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం (Central Government) లేఖ రాసింది.
ఇంకా ఆ కమిటీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ (ఎల్ అండ్ డబ్ల్యూ), అదనపు డైరెక్టర్ జనరల్ (కంటోన్మెంట్స్) డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (DGDE), ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం నుండి అదనపు డీజీ (భూమి, పనుల, పర్యావరణం), డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ (సదరన్ కమాండ్, పూణే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు సభ్యులుగా ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ఉంటారు. ఈ కమిటీ.. భూమి, స్థిరాస్తులు, కంటోన్మెంట్ బోర్డ్ (Cantonment Board) ఉద్యోగులు,పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, చరాస్తులు, దుకాణాలు, రోడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్, రికార్డులను పరిశీలిస్తుందని లేఖలో పేర్కొన్నారు.
ఇక, నెల రోజుల్లో పూర్తి నివేదికను సమర్పించాలని కమిటీకి కేంద్రం స్పష్టం చేసింది. ఇక, కంటోన్మెంట్ను Cantonment Board) జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరుతుంది. మంత్రి కేటీఆర్ కూడా పలుసార్లు ఇదే విషయంపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్తో హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి విన్నవించారు. ఇక, 2022 డిసెంబర్ 14న తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రూపొందించిన ప్రాథమిక నివేదికను కేంద్ర రక్షణ శాఖకు పంపిన విషయం తెలిసిందే.