KCR BRS: బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ సిద్ధం.. నేడు ఢిల్లీకి కేసీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరాలను ముమ్మరం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - December 12, 2022 / 11:14 AM IST

ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్‌.. దేశరాజధానిపై దృష్టిపెట్టింది. ఢిల్లీలో ఇప్పటికే పార్టీ కార్యాలయం సిద్ధమవగా, ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 14న పార్టీ ఆఫీస్‌ ప్రారంభం కానుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని మంత్రి వేముల, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఇప్పటికే పరిశీలించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదివారం ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్‌ తేజతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుధాకర్‌ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయ (BRS) ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.

తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీ (Delhi Tour)లో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ (CM KCR) ఫర్‌ ఇండియా, దేశ్‌ క నేత.. కిసాన్‌ కీ భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Also Read: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!